calender_icon.png 30 October, 2025 | 7:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం.. దైన్యం

29-10-2025 12:16:25 AM

  1. కొనుగోలు కేంద్రాల్లో రైతుల గోస
  2.   20 రోజులు గడుస్తున్నా తూకం వేస్తలేరు
  3. అధికారుల నిర్లక్ష్యం.. వర్షాలకు తడుస్తున్న ధాన్యం 
  4. తుంగతుర్తిలో మొలకెత్తిన ధాన్యం 

తుంగతుర్తి, అక్టోబర్ 28: కొనుగోలు కేంద్రాల్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ధాన్యం కాంట వేస్తలేరు. దీంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ధాన్యం తడిసి రైతులు అరిగోస పడాల్సి వస్తుంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో 20 రోజులు గడుస్తున్నా పూర్తిస్థాయిలో కాంట మొదలు కాలేదు. అధికారుల అలసత్వం కారణంగా పూర్తిస్థాయిలో మిల్లులకు అనుమతి రాకపోవడంతో మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు చందంగా రైతుల పరిస్థితి మారింది.

దీనికి తోడు ప్రకృతి వైపరీత్యం మెంథా తుఫాను రావడంతో ఎండబెట్టుకొని పట్టుకున్న ధాన్యం కూడా తడిసిపోయింది. దీనికి తోడు ప్రతి సెంటర్‌లో ధాన్యం పట్టుకునే మిషన్లు కూడా పూర్తిస్థాయిలో నడవక మొరాయిస్తున్నాయి. ధాన్యం తేమ శాతం కేవలం 17 శాతమే ఉండాలని ప్రభుత్వం నిబంధన పెట్టడంతో ప్రస్తుతం రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.

గడచిన మూడు రోజులుగా తుఫాన్ ప్రభావం తుంగతుర్తి మండలంలో ఎక్కువగా ఉండడంతో రైతు లు టార్పాలిన్లు కప్పుకున్న ధాన్యం రాశులు కూడా తడిచాయి. కొన్నిచోట్ల ధాన్యపు రాశుల కింది నుంచి నీరు వెళ్లడంతో కింది భాగంలో ధాన్యం మొలకెత్తింది. తుఫాన్ ప్రభావంతో రైతులు 25 తేమ శాతం ఉన్న ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని రైతులు కోరున్నారు. 

ధాన్యం తడిసి మొలకెత్తింది

గడచిన 15 రోజులుగా సొసైటీ కేంద్రంలో ధాన్యం పోశాను. కాంటాలు సాగే తరుణంలో తుఫాన్ ప్రభావంతో ధాన్యం తడిసి మొలకెత్తింది. ప్రస్తుతం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్న కావున తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలి.

 లక్ష్మీ, రైతు, తుంగతుర్తి 

15 రోజులు గడుస్తున్నా కాంటా వేయలే

15 రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకుని వచ్చిన. మంచిగా ఆరి కాంటా పెట్టే సమయంలో వాన పడటంతో వడ్లు మొత్తం తడిసినయ్. ఇప్పుడు ఏం చేయలేం. వడ్లు తడిసిన రైతులందరూ ఇట్లనే ఇబ్బంది పడుతుండ్రు. ఏం కోర్రీలు పెట్టకుండా గవర్నమెంట్ వడ్లు కొనాలే.

కోదాటి మోహన్‌రావు, తుంగతుర్తి