24-06-2025 01:33:32 AM
హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఆ దేశాల్లో చిక్కుకున్న వారిని తిరిగి తెలంగాణకు రప్పించేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ నుంచి ఇద్దరు, సోమవారం ఉదయం ఇరాన్ నుంచి నలుగురు తెలంగాణవాసులు భారత్కు చేరుకున్నారు. సోమవారం రాత్రి వరకు మరో ఏడుగురు రావాల్సి ఉన్నట్టు ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులు పేర్కొన్నారు. ఇజ్రాయెల్లో విమాన సర్వీసులను నిలిపేయడం తో ఇంకా చాలా మంది రావాల్సి ఉంది.
దీని కోసం భారత విదేశాంగ శాఖతో తెలంగాణ ప్రభుత్వం చర్చ లు జరుపుతోంది. స్వదేశానికి వచ్చే ప్రతి తెలంగాణ నివాసికి సకాలంలో సహాయం, సరైన వసతి, తదుపరి ప్రయాణ సౌకర్యం అందేలా చూడాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. పౌరులంతా అధికారిక మార్గాలనే అనుసరించాలని, ధ్రువీకరించని సమాచారంపై ఆధారపడొ ద్దని సూచించారు.