24-06-2025 12:19:17 AM
వ్యవసాయ అధికారి ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు
ఇద్దరు నిందితులు అరెస్ట్
నాగర్ కర్నూల్ జూన్ 23 (విజయక్రాంతి)గుజరాత్ రాష్ట్రం నుండి నకిలీ పత్తి విత్తనాలను నాగర్ కర్నూల్ జిల్లా ప్రాంతానికి సరఫరా చేసిన ముఠా పోలీసులకు చిక్కింది. గుజరాత్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి నుండి జడ్చర్ల ప్రాంతానికి చెందిన వ్యక్తి నకిలీ పత్తి విత్తనాలు కొనుగోలు చేసి కొరియర్ ద్వారా సరఫరా చేసాడు. అక్కడి నుంచి నేరుగా నాగర్ కర్నూల్ జిల్లా ప్రాంత రైతులకు విక్రయించగా వ్యవసాయ అధికారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగి ముఠాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
సోమవారం జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకు తెలిపారు. ఈ ఏడాది మే 30న తిమ్మాజిపేట మండలం ఆవంచలో నకిలి విత్తనాలు విక్రయిస్తున్నట్లు మండల వ్యవసాయశాఖ అధికారి కమాల్ కుమార్ కు సమాచారం రావడంతో పోలీసుల సహకారంతో గ్రామంలోని కనిక వెంకటయ్య ఇంట్లో తనికీలు జరపగా 10 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.
అతన్ని విచారించగా అదే గ్రామానికి చెందిన వస్పరి వెంకటయ్య అనే వ్యక్తి వద్ద కరీదు చేసినట్లు చెప్పాడు. అతనిని విచారించగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణానికి చెందిన పబ్బ వెంకట్ నారాయణగౌడ్ అనే వ్యక్తి వద్ద విక్రయించినట్లు అంగీకరించాడు. అతన్ని ప్రశ్నించగా గుజరాత్ రాష్ట్రానికి చెందిన సత్యమూర్తి కుమార్ దగ్గర కొనుగోలు చేసి కొరియార్ ద్వారా తెప్పించినట్లు ఒప్పుకున్నాడు.
దర్యాప్తులో భాగంగా పబ్స వెంకట్నారాయణగౌడ్ ద్వారా సత్యమూర్తి కుమార్ జడ్చర్ల పట్టణానికి రప్పించి సోమవారం అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నాడు. తిమ్మాజిపేట ఏవో కమాల్ కుమార్ ఫిర్యాదు మేరకు పబ్బ వెంకట్ నారాయణ గౌడ్, సత్యమూర్తి కుమార్ లపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. గ్రామాల్లో నకిలి పత్తి విత్తనాలు విక్రయిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్, సీఐ కనకయ్య, తిమ్మాజిపేట ఎస్త్స్ర హరిప్రసాదొడ్డి, తాదూర్ ఎస్త్స్ర గురుస్వామి తదితరులుపాల్గొన్నారు.