09-06-2025 02:24:19 PM
హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం(BRS government rule)లో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Kalvakuntla Chandrashekar Rao) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్(Kaleshwaram Lift Irrigation Project) పై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారిస్తుంది. ఇందులో భాగంగానే మాజీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సోమవారంనాడు విచారణకు హాజరయ్యారు. 45 నిమిషాలపాటు హరీష్ రావును కమిషన్ విచారించింది. కాళేశ్వరం విచారణ అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. విచారణలో ఏలాంటి ప్రశ్నలు అడిగారన్న దానిపై మాట్లాడుతూ... కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చానని చెప్పారు. అన్ని ఆధారాలు కూడా కమిషన్ కు సమర్పించానని వెల్లడించారు.
కమిషన్ ముందు హాజరై రాజకీయాలు మాట్లాడడం మంచిది కాదని సూచించారు. తమ్మడిహట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారని చాలాసేపు ప్రశ్నించారని వివరించారు. తమ్మిడిహట్టి వద్దే కట్టడానికి అన్ని ప్రయత్నాలు చేశామని చెప్పామన్నారు. ఆనాడే అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ మంత్రిని కోరామని, ఏడేళ్లుగా ఒప్పుకోలేదు.. ధర్నాలు జరుగుతున్నాయని మహారాష్ట్ర కాంగ్రెస్ మంత్రి(Maharashtra Congress Minister) చెప్పారని తెలిపారు. లేఖలో ఏముందంటే మీకు మీరుగా నిర్ణయించుకుని పనులు ప్రారంభిస్తే ఖర్చు వృథాగా మారే అవకాశం ఉందని చెప్పారు. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ఐదారు సమావేశాలు జరిగాయని హరీశ్ రావు వెల్లడించారు. కేసీఆరే స్వయంగా మహారాష్ట్ర వెళ్లి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు చెప్పే ప్రయత్నం చేశారని గుర్తుచేశారు.
మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం పోయి బీజేపీ ప్రభుత్వం వస్తే మళ్లీ సంప్రదించా మన్నారు. తమ్మిడిహట్టి వద్ద అనుమతించాలని.. ఎంత నష్టపరిహారమైనా ఇస్తామని స్పష్టంగా చెప్పామని తెలిపారు. తమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ కట్టడానికి అనుమతి ఇవ్వాలని మహారాష్ట్ర సీఎంకు కేసీఆర్(KCR) చాలాసార్లు విజ్ఞప్తి చేశారని తెలిపారు. ఏడేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోనప్పుడు మేమెలా ఒప్పుకుంటామని మహారాష్ట్ర సీఎం చెప్పారని వెల్లడించారు. ఏడేళ్లు మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ఉన్నా తమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ ఒప్పించడంలో తీవ్రంగా విఫలమయ్యారని హరీశ్ రావు ఆరోపించారు. ఈ సమయంలోనే తమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేవని సెంట్రల్ వాటర్ కమిషన్ రెండు లేఖలు రాసిందన్నారు. నీటి లభ్యత తక్కువ ఉందని, ప్రత్యామ్నాయం చూసుకోవాలని లేఖలో పేర్కొందని చెప్పారు. సీడబ్ల్యూసీ నుంచి వచ్చిన మూడు లేఖలు కమిషన్ కు ఇచ్చామని హరీష్ రావు వెల్లడించారు.