21-09-2025 12:00:00 AM
-కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త
-కొద్దిరోజులుగా మద్యానికి బానిసైన హంతకుడు
-కుమ్రం భీంఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలో ఘటన
రెబ్బెన,సెప్టెంబర్20 (విజయక్రాంతి) : కట్టుకున్నోడే కాలయముడయ్యాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను భర్త దారుణంగా హత్య చేశారు. ఈ దారుణం కుమ్రం భీంఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని నారాయణపూర్లో చోటు చేసుకుంది. రెబ్బె న సీఐ సంజయ్ తెలిపిన వివరాల మేరకు వ్యవసాయ పనులు చేస్తున్న గజ్జల తిరుపతికి మంచిర్యాల జిల్లా బూదఖలానుకు చెందిన స్రవంతి (38)తో వివాహమైంది.
వీరికి ఇద్దరు పిల్లలు.కొన్నాళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. తిరుపతి తాగుడుకు బానిస కావడంతో వారి మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో భార్యను ఎలాగైన మట్టుపెట్టాలని నిశ్చయించుకున్న తిరుపతి శనివారం తెల్లవారుజామున ఇంటి పనుల్లో నిమగ్నమై ఉన్న స్రవంతిపై ఒక్కసారిగా గొడ్డలిలో దాడి చేయడంతో ఆమె అక్కడిక్కక్కడే మృతి చెందింది.
గ్రామస్థుల ద్వారా సమాచారం అందుకున్న రెబ్బెన ఎస్ఐ వెంకటకృష్ణ, సీఐ సం జయ్లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హత్య జరిగిన తీరును, అందుకు గల కారణాలను స్థానికులను ఆడిగి తెలుసుకున్నారు. సంఘటన స్థలాన్ని ఏఎస్పీ చిత్తరంజన్ సందర్శిం చారు. మృతదేహాన్ని పరిశీలించి హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతురాలి తమ్ముడు టేకుమట్ల సంజయ్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.