బర్డ్ఫ్లూపై ఆరోగ్య శాఖ అలర్ట్
హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): పొరుగు రాష్ట్రాలైన ఏపీ, మహారాష్ట్రతో పాటు కేరళ, జార్ఖండ్లో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా (బర్డ్ఫ్లూ, హెచ్5ఎన్1) వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ హెచ్చరించింది. కోళ్లు, బాతులు, పావురాలు, ఇతర పక్షుల ద్వారా ఈ వైరస్ మనుషులకు సోకుతుందని వెల్లడించింది. చికెన్, గుడ్లను ముట్టుకున్నప్పుడు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలని సూచించింది. కోళ్లు, గుడ్లను పూర్తిగా ఉడికిన తర్వాతే వాటిని తినాలని వెల్లడించింది. జలుబు, దగ్గు, ఉన్నవాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలని, ఇతరులకు సోకకుండా మాస్కులు ధరించాలని తెలిపింది.
రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయవద్దని పేర్కొంది. కాగా ఇప్పటివరకు తెలంగాణలో ఈ కేసులు నమోదు కాలేదని, వైరస్ లక్షణాలుంటే సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. ఇప్పటివరకు కేరళలోని కొట్టాయం, అలప్పుళ, మహారాష్ట్రలోని నాగ్పూర్, జార్ఖండ్లోని రాంచీ, ఏపీలోని నెల్లూరులో ఈ కేసులు నమోదు అయ్యాయని, పలువురు మరణించారని జాతీయ వ్యాధి నివారణ సంస్థ (ఎన్సీడీసీ) వెల్లడించిది. పక్షులు, కోళ్లలో అసాధారణ మరణాలు సంభవిస్తే వెంటనే పశుసంవర్ధక శాఖ అధికారులకు సమాచారం అందించాలని, తద్వారా ఈ వ్యాధి సంక్రమించకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని ఎన్సీడీసీ వెల్లడించింది.






