డివిజన్ల పునర్విభజనపై విచారణ వాయిదా
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో ఇటీవల డివిజన్ల సంఖ్యను పెంచడంపై విచారణ రేపటికి వాయిదా పడింది. డివిజన్ల పునర్విభజనను సవాలు చేస్తూ వినయ్ కుమార్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. అత్యవసర విచారణ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి విచారణకు స్వీకరించారు. జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్వ్యవస్థీకరణ సమయంలో ప్రభుత్వం ప్రజల అభ్యంతరాలను సరిగ్గా పరిగణనలోకి తీసుకోలేదని, రాంనగర్ డివిజన్ పై తన అభ్యంతరాలను తీసుకోలేదని వినయ్ కుమార్ తన పిటిషన్లో పేర్కొన్నారు. పర్యవసానంగా, కొత్త డివిజన్ల స్వరూపాన్ని అధికారికంగా ఖరారు చేయడానికి ముందు, తాను సమర్పించిన అభ్యంతరాలను సమీక్షించి, వాటికి స్పందించాలని అధికారులను ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. దీంతో డివిజన్ల పునర్విభజన వ్యవహరంపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.




