calender_icon.png 12 September, 2025 | 2:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉస్మాన్‌సాగర్‌కు భారీ వరద.. భారీగా ఇన్‌ఫ్లో

12-09-2025 11:58:18 AM

  1. 6 గేట్లు 4 అడుగులకు పెంపు, 2600 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల..
  2. జలాశయం పరీవాహక ప్రాంతంలో కుండపోత వర్షాలు, అప్రమత్తమైన జలమండలి అధికారులు..
  3. ఉదయం 10 గంటల నుండి ప్రవాహం పెంపు, మూసీ పరివాహక ప్రజలకు హెచ్చరిక..
  4. 3 అడుగుల నుండి 4 అడుగులకు పెరిగిన గేట్ల ఎత్తు, నిరంతర పర్యవేక్షణ

హైదరాబాద్G  హైదరాబాద్‌కు తాగునీటిని అందించే ప్రధాన జలాశయాల్లో ఒకటైన ఉస్మాన్‌సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పరీవాహక ప్రాంతంలో గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెగని వర్షాలు, రాబోయే గంటల్లో కూడా వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. జలాశయంలోకి వస్తున్న భారీ వరదను నియంత్రించేందుకు, నీటిమట్టాన్ని అదుపులో ఉంచేందుకు ఉస్మాన్‌సాగర్ డ్యామ్ యొక్క ఆరు గేట్లను ఎత్తివేస్తున్నట్లు డీజీఎం ఉస్మాన్‌సాగర్ ప్రకటించారు. ఈరోజు ఉదయం 10 గంటల నుండి ఉస్మాన్‌సాగర్ జలాశయం యొక్క ఆరు గేట్లను 3 అడుగుల నుండి 4 అడుగుల ఎత్తుకు పెంచనున్నారు. దీని ద్వారా సుమారు 2600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. జలాశయంలోకి వస్తున్న ఇన్‌ఫ్లోను పరిగణనలోకి తీసుకొని, ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీఎం ఉస్మాన్‌సాగర్ తెలిపారు.

మూసీ పరివాహక ప్రజలకు హెచ్చరిక...

గేట్లు ఎత్తివేతతో దిగువకు విడుదలయ్యే నీరు మూసీ నదిలో ప్రవహిస్తుంది కాబట్టి, మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. నదిలోకి ఎవరూ వెళ్లవద్దని, పశువులను నది వైపు పంపవద్దని, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. నదీ తీర ప్రాంతాల్లో నివసించే వారు జాగ్రత్తగా ఉండాలని, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని DGM కార్యాలయం కోరింది. జలమండలి అధికారులు జలాశయం నీటిమట్టాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని సమాచారం. అవసరమైతే మరిన్ని గేట్లను ఎత్తివేసే అవకాశం కూడా ఉందని అధికార వర్గాలు తెలిపాయి.