తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30-40 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. రాష్ట్రంలోని 17 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాలు, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, మెదక్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం రాత్రి ఆగ్నేయ హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
దీనివల్ల పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో పాటు ట్రాఫిక్ మందగించింది. నమోదైన అత్యధిక వర్షపాత వివరాలను పరిశీలిస్తే, సరూర్నగర్లో 112 మి.మీ, ఆ తర్వాతి స్థానాల్లో ఎల్బీ నగర్ (95 మి.మీ), ఉప్పల్ (81.3 మి.మీ) మరియు నాగోల్ (79 మి.మీ) ఉన్నాయి. ఇవాళ మధ్యాహ్నం వరకు హైదరాబాద్లో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని, సాయంత్రానికి పరిస్థితులు మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం, రాత్రి వేళల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.






