తక్షణమే స్పందించిన మేయర్
ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 26వ డివిజన్ సుభాష్ నగర్ ప్రాంతంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద నీరు ఓ ఇంటిలోకి చేరిన విషయం తెలుసుకున్న నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. మున్సిపల్ సిబ్బందితో కలిసి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన మేయర్, ఇంటిలోకి చేరిన వరద నీటిని ఎత్తిపోసే పనులను స్వయంగా పర్యవేక్షించారు.
వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సమస్యలు తలెత్తిన వెంటనే స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని మేయర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ రాజ మనోహర్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






