28-07-2025 01:20:47 AM
హెపటైటిస్ డే సందర్భంగా నిపుణుల హెచ్చరిక
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 27 (విజయక్రాంతి): మనదేశంలో కాలేయ సంబం ధిత వ్యాధులు, మరణాలకు వైరల్ హెపటైటిస్ ప్రధాన కారణాల్లో ఒకటిగా ఉంది. ప్ర పంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 354 మిలియన్ల మంది హెపటైటిస్ బీ, సీ వంటి దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నారు. వీటివల్ల లివర్ సిర్రోసిస్, లివర్ క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఏర్పడి ఏటా దాదా పు 1.1 మిలియన్ల మంది మరణిస్తున్నారు.
భారతదేశంలో సుమారు 40 మిలియన్ల మందికి హెపటైటిస్ బీ, 12 మిలియన్ల మందికి హెపటైటిస్ సీ ఉన్నట్లు అంచనా. హెపటైటిస్ అనేది కాలేయంలో వాపు కలిగించే వ్యాధి, ఇది ప్రధానంగా వైరల్ ఇన్ఫెక్ష న్ల వల్ల ఏర్పడుతుంది. హెపటైటిస్ వైరస్లు ఐదు ముఖ్యమైన రకాలుగా ఉన్నాయి: ఎ, బీ, సీ, డీ, ఇ. హెపటైటిస్ ఎ, ఇ సాధారణం గా కలుషితమైన ఆహారం లేదా నీటి ద్వారా వ్యాపిస్తాయి.
ఇక హెపటైటిస్ బీ, సీ మాత్రం సోకిన వ్యక్తుల రక్తం లేదా శరీర ద్రవాల ద్వా రా సంక్రమిస్తాయి. హెపటైటిస్ బీ, సీలో అ త్యంత ప్రమాదకరం ఏమిటంటే, ఇవి చాలా ఏండ్ల పాటు ఎలాంటి లక్షణాలు లేకుండా శరీరంలో ఉండి, నిశ్శబ్దంగా కాలేయాన్ని తీ వ్రంగా దెబ్బతీస్తాయి. బంజారా హిల్స్లోని కేర్ హాస్పిటల్స్ క్లినికల్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్,
మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ డాక్టర్ ఆకాశ్ చౌదరి మాట్లాడుతూ ‘హెపటైటిస్ బీ లేదా సీ వైరస్ సోకిన చాలా మందికి ఆ విషయం గురించి తెలియకపోవడం పెద్ద సమస్య. వారు ఆసుపత్రిలో చేరే సమయానికి వారి కాలేయం తీవ్రంగా దెబ్బతింటుం ది. సాధారణ స్క్రీనింగ్ పరీక్షల ద్వారా ఈ వ్యాధిని ముందుగానే గుర్తించవచ్చు. ప్రజలు ఈ విషయాన్ని గ్రహించాలి’ అని చెప్పారు.
శుభవార్త ఏమిటంటే, నివారణ, చికిత్స రెండూ ఇప్పుడు సులభంగా అందుబాటు లో ఉన్నాయి. కాలేయాన్ని రక్షిస్తూ, వైరస్ను నియంత్రించే దీర్ఘకాలిక మందులతో హెపటైటిస్ బీని ప్రభావవంతంగా నియంత్రించ వచ్చు. ఒకప్పుడు చికిత్సకు కష్టంగా భావించిన హెపటైటిస్ సీ కూడా ఇప్పుడు నోటి ద్వారా తీసుకునే మందులతో దాదాపు అన్ని సందర్భాల్లో పూర్తిగా నయం చేయగలుగుతున్నారు.
ఈ చికిత్సలు భారత్లో అందుబా టులో ఉండటంతో ఇప్పటికే వేలాది మంది రోగులు పూర్తిగా కోలుకున్నారు. ‘టీకాలు వేయించడం అనేది ఎంతో శక్తివంతమైన నివారణా చర్య. హెపటైటిస్ బీ వ్యాక్సిన్ చాలా ప్రభావవంతమైంది. ఇది నవజాత శిశువులకు అలాగే ప్రమాదంలో ఉన్న పెద్దలందరికీ ఇవ్వాలి. ప్రజలు స్టెరిలైజ్ చేయని వైద్య పరికరాలు, సూదులు లేదా రేజర్లు ఇతరులతో పంచుకోకూడదు’ అని డాక్టర్ ఆకాశ్ పేర్కొన్నారు.
కేర్ హాస్పిటల్స్లోని నిపుణులు కాలేయ సంబంధిత సమస్యలను సమయానికి గుర్తించి చికిత్స పొందేందుకు క్రమం తప్పకుండా కాలేయ తనిఖీలు, హెపటైటిస్ స్క్రీనింగ్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా కాలేయ వ్యాధి, రక్త మార్పిడి లేదా అధిక ప్రమాదకర ప్రవర్తనల చరిత్ర ఉన్నవారు తప్పనిసరిగా ఈ పరీక్షలు చేయించుకోవాలని పేర్కొంటున్నారు.
కాలేయ ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు ఆసుపత్రి తరచూ కమ్యూనిటీ కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలు, రోగి విద్యా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. “మద్యపానాన్ని నివారించడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, సురక్షితమైన లైంగిక సంబంధాలను పాటించడం, టీకాలు వేయించుకోవడం వంటి సాధారణ జీవనశైలి మన కాలేయాన్ని రక్షించడంలో కీలకపాత్ర పోషిస్తాయి’ అని డాక్టర్ ఆకాశ్ పేర్కొన్నారు.