17-06-2025 12:28:32 AM
- ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ నేత కేటీఆర్ విచారణకు హాజరు
-రేస్ సమయంలో వాడిన సెల్ఫోన్లు 18 లోపు అప్పగించాలి
- అవసరమైతే మళ్లీ పిలుస్తాం: ఏసీబీ
హైదరాబాద్, సిటీ బ్యూరో జూన్ 16 (విజయక్రాంతి): ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ విచారణ సోమవారం ముగిసింది. ఉదయం 10 గంట లకు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఏసీబీ కార్యాలయానికి న్యాయ వాది రామచందర్రావుతో కలిసి హాజరైన కేటీఆర్ను అధికారులు దాదాపు ఎని మిది గంటల పాటు విచారించారు. సుదీ ర్ఘ విచారణలో ఏసీబీ అధికారులు కేటీఆర్కు 60కి పైగా ప్రశ్నలను సంధించినట్లు తెలుస్తోంది.
ఫార్ములా ఈ కేసులో విచారణకు హాజరుకావడం కేటీఆర్కు ఇది రెండోసారి. ఎఫ్ఈవో కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన స్టేట్మెంట్లు, ఫిర్యాదుదా రుడు దాన కిషోర్ స్టేట్మెంట్, ఐఏఎస్ అరవింద్కుమార్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఏసీబీ అధికారులు కేటీఆర్ను ప్రధానంగా ప్రశ్నించారు.
ముఖ్యం గా హెచ్ఎండీఏ నిధుల దుర్వినియోగం, క్యాబినెట్ ఆమోదం లేకుండానే రూ. 54.88కోట్లను ఎఫ్ఈవో కంపెనీకి ఎందుకు బదిలీ చేశారన్న అంశాలపై ఏసీబీ అధికారు లు లోతుగా ఆరా తీశారు. ఫార్ములా ఈ కా ర్ రేస్ నుంచి గ్రీన్కో తప్పుకోవడానికి కారణాలు, బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల కొనుగోళ్లపై కూడా ప్రశ్నలు అడిగినట్లు స మాచారం. విచారణ సమయంలో కేటీఆర్ సెల్ఫోన్ను సీజ్ చేసేందుకు అధికారులు ప్రయత్నించారు.
తాను సెల్ఫోన్ తీసుకురాలేదని కేటీఆర్ సమాధానం ఇచ్చారు. దీంతో ఈ -రేస్ సమయంలో వాడిన సెల్ఫోన్లను ఈ నెల 18లోపు అప్పగించాలని కేటీఆర్ను ఏసీబీ అధికారులు ఆదేశించారు. ఏసీబీ ప్రశ్నలకు బదులిస్తూ కేటీఆర్, హెచ్ఎండీఏ నిధులను ఎఫ్ఈవోకు పంపింది వాస్తవమేనని, అయితే ఇందులో తాను వ్యక్తిగతంగా ఎక్కడా లబ్ధి పొందలేదని దర్యాప్తు అధికారులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
అగ్రిమెం ట్ల వ్యవహారం అంతా అధికారులే చూసుకున్నారని, స్పాన్సర్లు వెనక్కి తగ్గడంతో హెచ్ ఎండీఏ నిధులతోనే ఫీజులు చెల్లించామని ఆయన వివరించినట్లు సమాచారం. ఇప్పటికే సేకరించిన పత్రాలను ముందుంచి, కేటీఆర్ స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. అవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుం దని, అప్పటివరకు అందుబాటులో ఉండాలని ఏసీబీ అధికారులు ఆయనకు సూచిం చినట్లు తెలుస్తోంది.
కేటీఆర్ విచారణ నేపథ్యంలో బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కా ర్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబ స్తు ఏర్పాటు చేశారు. దాదాపు 400 మంది పోలీసులు మోహరించారు. ఏసీబీ కార్యాలయంలోకి ఎవరినీ అనుమతించలేదు. కేటీ ఆర్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు తెలం గాణ భవన్కు చేరుకుని సంఘీభావం తెలిపారు.
అడిగిన ప్రశ్ననే మళ్లీ మళ్లీ అడిగారు: కేటీఆర్
ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు హాజరైన అనంతరం కేటీఆర్ తె లంగాణ భవన్కు వచ్చారు. ఆయనతో పా టు హరీశ్రావు, పార్టీ ముఖ్యనేతలున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. విచారణలో పొద్దటి నుంచి అధికారులు ఒక్కటే ప్రశ్న మళ్లీ మళ్లీ అడిగారన్నారు.
పై నుంచి రాసిచ్చిన ప్రశ్నలనే అడిగారని, సీఎం రేవంత్రెడ్డి జైల్లో ఉన్నందున తమను కూడా జైలులో పెట్టాలని చూస్తున్నట్లుందని కేటీఆర్ ఆరోపించారు. జైలులో పెడితే విశ్రాంతి తీసుకుంటానన్నారు. పాలన చేతగాని దద్ద మ్మ ప్రభుత్వమని, సీఎం తనను చేసిందేమి లేదన్నారు. ఇప్పటికే తనపై 14 కేసులు పెట్టారని, 14వేల కేసులు పెట్టుకున్నా భయపడన న్నారు.
విచారణలు డైలీ సీరియల్స్ను మిం చిపోయాయని ఎద్దేవా చేశారు. ఈనెల 21న కేసీఆర్తో చర్చించి కాళేశ్వరం ప్రాజెక్టుపై కార్యక్రమం చేపడతామన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలను ఫుట్బాల్ ఆడుకునేలా కార్యకర్తలు పార్టీ కోసం పనిచేయాలని, అధికార పార్టీకి డిపాజిట్లు రావొద్దన్నారు. హరీశ్రావు మాట్లాడు తూ.. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, కేటీఆర్ ఒక వ్యక్తి కాదు శక్తి అన్నారు. లక్షలాది కార్యకర్తలు అండ ఉన్న కేటీఆర్ను ముట్టుకుంటే భస్మం అవుతారన్నారు. రేవంత్ పాలనలో తుమ్మినా దగ్గినా కేసులు పెడుతున్నారని విమర్శించారు.
వందసార్లు పిలిచినా వెళ్తాను..
ఫార్ములా ఈ కేసులో తనను అరెస్ట్ చేయించే ఆలోచనల్లో రేవంత్రెడ్డి ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ బ్రాం డ్ ఇమేజ్ పెంచడం కోసం తీసుకున్న నిర్ణ యం కారణంగా ఒకసారి కాదు వందసార్లు పిలిచినా విచారణకు హాజరవుతానని ఆయ న అన్నారు.
ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు.. రేవంత్రెడ్డి కూడా ఏసీబీ కేసు ఎదుర్కొంటున్న నేపథ్యంలో దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్షకు రమ్మంటే ఇంతవరకూ ఆ పిరికిపంద నుంచి స్పందన రాలేదని మండిపడ్డారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతున్న కాంగ్రెస్, రేవంత్ కపట నైజాన్ని బీసీలు గమనిస్తున్నారని తెలిపారు.
విచారణకు ముందు కేసీఆర్తో భేటీ
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణకు ముందు బంజారాహిల్స్లోని నందినగర్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, హరీశ్రావుతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈ కేసుకు సంబంధించి అనేక అంశాలు, తాజా పరిస్థితులపై వీరిరువురు మాట్లాడుకున్నట్లు సమాచారం. సమావేశం అనంతరం తెలంగాణభవన్కు కేటీఆర్ చేరుకున్నారు.
అక్కడ పార్టీ ముఖ్యనేతలు, సీనియర్ నాయకులతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తెలంగాణభవన్కు చేరుకున్నారు. అక్కడ నుంచి కేటీఆర్ ఏసీబీ విచారణకు బయలుదేరివెళ్లారు. ఏసీబీ కార్యాలయం దగ్గర బీఆర్ఎస్ శ్రేణులకు, పోలీసులకు పలుసార్లు వాగ్వాదం చోటు చేసుకున్నది. ఏసీబీ పరిసర ప్రాంతాల్లో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలను ముందుకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలుమార్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు.