13-11-2025 12:19:52 AM
-ప్రధాన రహదారిపై ప్రమాదకరంగా గుంతలు
-ప్రమాదం జరిగితే బాధ్యులెవరు..?
బెజ్జూర్, నవంబర్ (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని సోమిని నుండి మొగ లి వరకు వెళ్లే ప్రధాన రహదారిపై ప్రమాదం కరంగా గుంతలు ఏర్పడ్డాయి. వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు కల్వర్టుల వద్ద ప్రమాదకరంగా గుంతలు ఏర్పడ్డాయి. ఈ రహదారి గుండా గిరిజన గ్రామాలకు, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు ప్రతినిత్యం వేలమంది ప్రయాణిస్తుంటారు. ప్రమాదకరంగా గుంతలు ఏర్పడ్డాయని గ్రామాల ప్రజలు ప్రయాణికులు సైతం అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ పట్టించుకోవడంలేదని విమర్శలు వస్తున్నాయి.
గతంలో బీటి రోడ్డు వేసిన కాంట్రాక్టర్ నాణ్యతతో పనులు చేపట్టకపోవడంతో ప్రధాన రహదారిపై ప్రమాద కరంగా గుంతలు ఏర్పడ్డాయని ప్రయాణికులు తెలుపుతున్నారు.అహిరి, ఆళ్లపల్లి వారసంతలకు వెళ్లి కూరగాయల వ్యాపారులు రాత్రి సమయంలో గమనించక వాహనాలు గుంతలలో పడి ప్రమాదాలు జరిగితే బాధ్యులు ఎవరని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుంతలు ఏర్పడ్డ ప్రాంతాల్లో మరమ్మత్తులు చేసి ప్రయాణికులకు రవాణా సౌకర్యం కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.