23 May, 2026 | 1:04 PM

ఎల్బీనగర్ ఎన్నాళ్లిలా..

19-06-2024 12:05 AM

పూర్తికాని జాతీయ రహదారి పనులు

ఇప్పటికే గంటల తరబడి ట్రాఫిక్ జామ్

వానలు ముదిరితే పరిస్థితిపై ఆందోళన

ఎల్బీనగర్, జూన్ 18 (విజయక్రాంతి) : వానోస్తే పుడమి పులకరిస్తుంది. కానీ, ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజల్లో వణుకుపుడుతుంది. పొంచి ఉన్న వరద ముప్పుతో ఆందోళనకు గురవుతున్నారు. వాన కురిసిందంటే చాలు దిల్‌షుఖ్‌నగర్, చైతన్యపురి, కొత్తపేట, ఎల్బీనగర్, మన్సూరాబాద్‌లోని పలు కాలనీలు నీట మునుగుతున్నాయి. జాతీయ రహదారిపై ఉన్న చింతలకుంట, పనామా గోదాం, సుష్మ థియేటర్, ఆటోనగర్ ప్రాంతాల్లో జనం ఇప్పటినుంచే భయపడుతున్నారు.

ఇక వాహనదారుల పరిస్థితి చెప్పనలవి కాదు. ఎక్కడివాహనాలు అక్కడే అన్నట్లుగా ట్రాఫిక్ సమస్యను ఊహించుకుని వణికి పోతున్నారు.  నాలాల ఆక్రమణతో వరద ముప్పు ఏటా పెరుగుతూనే ఉంది.  చిన్నపాటి వానకే నీళ్లలో మునిగే కాలనీలు ఈ సారి అసంపూర్తి జాతీయరహదారి విస్తరణ పనుల వల్ల మొత్తం మునిగిపోతాయోమనని ఆందోళన చెందుతున్నారు. చింతలకుంట, సుష్మ థియేటర్, ఆటోనగర్ ప్రాంతాల్లో ఇంకా రోడ్డు పనులు కొనసాగుతున్నాయి.

రోడ్డు ఎత్తు కూడా పెరుగుతోంది. ఫలితంగా లోతట్టు ప్రాంతం పెరిగే అవకాశం ఉంది. దీంతో ముంపు సమస్య తీవ్రం కానుందని స్థానికులు గుబులు చెందుతున్నారు. జాతీయ  రహదారి వెంట సీసీ డ్రైన్ల నిర్మాణాలు పూర్తికాకపోవడంతో వరద సమస్య ఎలా ఉంటుందోనని భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, నాలాల విస్తరణ చేపట్టి, వరద వెళ్లేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. జాతీయ రహదారి పనులను వేగంగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.