రామ నామస్మరణతో మార్మోగిన భాగ్యనగరం
- కనులపండువగా శ్రీరామ శోభాయాత్ర
- సీతారాంబాగ్ వద్ద యాత్రను ప్రారంభించిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- సుల్తాన్ బజార్ హనుమాన్ వ్యాయామశాల వరకు వేడుక
- ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో ధూల్పేట్ నుంచి మరో భారీయాత్ర
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 27 (విజయక్రాంతి): శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం భాగ్య నగరం జైశ్రీరామ్ నినాదాలతో మార్మోగింది. నగర వీధుల్లో వేలాది మంది రామ భక్తుల కోలాహలం నడుమ శ్రీరామ శోభాయాత్ర అత్యం త వైభవంగా కొనసాగింది. చారిత్రక సీతారాంబాగ్ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈ శోభాయాత్రను ప్రారంభించారు.
మధ్యా హ్నం 2 గంటలకు మొదలైన ఈ యాత్ర.. నిర్ణీత రూట్ మ్యాప్ ప్రకారం రాత్రి 10 గంట ల కల్లా సుల్తాన్బజార్లోని హనుమాన్ వ్యాయామశాలకు చేరుకుని ముగిసింది. శోభాయాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా గవర్నర్ ప్రసంగించారు. భారతీయ సంస్కృతిలో రామాయణానికి ఉన్న విశిష్టతను ఆయన గుర్తుచేశారు. అంతకుముందు సీపీ వీసీ సజ్జనార్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తదితరులతో కలిసి ఆయన శ్రీసీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. సీతారాంబాగ్ ప్రధాన యాత్రతోపాటు నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ శ్రీరామ నవమి వేడుకలు అంబరాన్ని అంటాయి.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో ధూల్పేటలోని ఆకాశ పురి హనుమాన్ మందిరం నుంచి మరో శోభాయాత్ర అట్టహాసంగా సాగింది. పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. నగర పరిధిలో మొత్తం 339 ప్రాంతాల్లో శ్రీరామనవమి కార్యక్రమాలు జరిగాయని, ఏకంగా 3 వేలకు పైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రోన్లు, సీసీటీవీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి అణువణువూ నిఘా పెట్టామని స్పష్టం చేశారు.




