ఫిన్లాండ్లో హైదరాబాద్ విద్యార్థి అదృశ్యం
- 45 రోజులుగా కనిపించని వనస్థలిపురానికి చెందిన మణిదీప్ రెడ్డి
- బాధిత కుటుంబానికి కేటీఆర్ భరోసా
ఎల్బీనగర్, జూన్ 21: వనస్థలిపురం డివిజన్కు చెందిన ముత్యంరెడ్డి మణిదీప్రెడ్డి ఉన్నత చదువుల కోసం ఫిన్లాండ్ దేశానికి వెళ్లి, 45 రోజులుగా ఆచూకీ లేకుండా పోయాడు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం మణిదీప్రెడ్డి తల్లిదండ్రులు ముత్యంరెడ్డి, మర్ణతల ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డితో రాజేంద్రనగర్లో కేటీఆర్ను కలిసి తమ కుమారుడి ఆచూకీపై మాట్లాడారు.
కొడుకు ఆచూకీ తెలియక అల్లాడిపోతున్న తల్లిదండ్రులకు బీఆర్ఎస్ పార్టీ తరపున కేటీఆర్ పూర్తి భరోసా, ధైర్యాన్ని ఇచ్చారు. ఒక సామాన్య కుటుంబం ఎన్నో ఆశలతో తమ బిడ్డలను ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపితే, ఇవ్వాళ ఆ బిడ్డ ఆచూకీ లేకుండా పోవడం ఆ కుటుంబానికి తీరని వేదన మిగిల్చిందన్నారు. స్థానిక పోలీసులు ఫిర్యాదును పట్టించుకోకపోవడంతోనే బాధిత తల్లిదండ్రులు న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించాల్సి రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
హైకోర్టు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఫిన్లాండ్లోని భారత రాయబార కార్యాలయం, తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేయడాన్ని మేము స్వాగతిస్తున్నామని కేటీఆర్ అన్నారు. ఫిన్లాండ్లోని భారత రాయబార కార్యాలయం, అక్కడి స్థానిక ప్రభుత్వంతో, అక్కడి అధికారులతో మాట్లాడి మణిదీప్ రెడ్డిని సురక్షితంగా వెతికి పట్టుకునేలా కేంద్ర విదేశాంగ శాఖ తక్షణమే రంగంలోకి దిగాలని కోరారు. తెలంగాణ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా పరిగణించి, విదేశాంగ శాఖ ద్వారా ఒత్తిడి తీసుకువచ్చి వీలయినంత తొందరగా మణిదీప్ రెడ్డిని వెతికిపట్టుకునేలా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు.






