20-06-2025 12:37:08 AM
వాషింగ్టన్, జూన్ 19: భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చింది తానేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే ప్రకటించుకున్న విషయం తెలిసిందే. కాల్పుల విరమణలో మీ ప్రమేయమేమీ లేదని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో స్పష్టం చేసినా ట్రంప్ మాత్రం పాత పాటే పాడుతూ వచ్చారు. బుధవారం ఓవల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ ఎట్టకేలకు నిజం ఒప్పుకున్నారు.
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మునీర్తో భేటీ అనంతరం ఓవల్ ఆఫీసులో ఈ ఇద్దరూ విలేకరులతో మాట్లాడారు. ‘చాలా తెలివైన ఇద్దరు యుద్ధాన్ని కొనసాగించకూడదని నిర్ణయించుకున్నారు. లేదంటే పరిస్థితులు అణుయుద్ధానికి దారి తీసేవి. ఆ రెండు దేశాలకు అణ్వాయుధాలు ఉన్నాయి. అవి ఉద్రిక్తతలను పరిష్కరించుకున్నాయి.’ అని పేర్కొన్నారు. ఇరాన్ మునీర్తో చర్చలు జరిపిందా అనే ప్రశ్నపై ఆయన స్పందిస్తూ... ‘అవును ఆయనకు ఇరాన్ బాగా తెలుసు.
అందరికంటే ఎక్కువ తెలుసు. యుద్ధం జరగకుండా ఆపినందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్పేందుకు ఇక్కడికి పిలిపించాను. యుద్ధం ఆగిపోయేలా కృషి చేసిన మోదీకి కూడా ధన్యవాదాలు. భారత్తో వాణిజ్య ఒప్పందంపై పని చేస్తున్నాం. పాక్తో కూడా వాణిజ్య ఒప్పందం ఉంటుంది.’ అని ట్రంప్ పేర్కొన్నారు. భారత్-పాక్ నడుమ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన మే 10 నుంచి ట్రంప్ తనే ఒప్పందం కుదిర్చానని చెప్పుకుంటూ వస్తున్నారు.