క్యాన్సర్ బాధితులకు అండగా ఉంటా..!
- వైద్యం కోసం ఆర్థిక సాయం అందిస్తా..
- టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
- క్యాన్సర్ బాధితురాలికి రూ.4 లక్షల ఆర్థిక సహాయం
- ఇటీవల సదాశివపేటలో రూ.10 లక్షల సాయం అందజేత
సంగారెడ్డి, జూన్ 9 (విజయక్రాంతి): క్యాన్సర్ వ్యాధితో బాధపడే వారికి వైద్య సహాయం నిమిత్తం తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్రెడ్డి (జగ్గారెడ్డి) తెలిపారు. సోమవారం సంగారెడ్డి పట్టణంలోని సోమేశ్వరవాడకు చెందిన రాణమ్మ అనే క్యాన్సర్ బాధితురాలిని పరామర్శించి ఆమె వైద్యం కోసం రూ.4 లక్షల ఆర్థిక సహాయం అందించారు.
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ..తన నియోజకవర్గంలో క్యాన్సర్ తో బాధపడే నిరుపేదలకు ట్రీట్మెంట్ కోసం ఆర్థిక సహకారం అందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. క్యాన్సర్ ట్రీట్ మెంట్ లక్షల రూపాయలతో కూడుకున్న వ్యవహారం కావడంతో పేదలు ఆర్థికంగా చితికిపోతున్నారని వాపోయారు. అందుకోసమే రాణమ్మకు ఆర్థిక సహాయం అందించానన్నారు.
అలాగే ఇటీవల సదాశివపేటలో క్యాన్సర్ పేషంట్ కు 10 లక్షల రూపాయలు అందించడం జరిగిందన్నారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ లక్షల రూపాయలతో కూడుకున్న వ్యవహారం కావడంతో పేదలు ఆర్థికంగా చితికిపోతున్నారని, ఇందుకోసం పేదలు అప్పులు చేయడంతో ఆ కుటుంబాలు చితికిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తనవద్దకు ఆరోగ్య సమస్య ల కోసం సహాయం కావాలని ఎంతోమంది వస్తుంటారని, వారికి ఎంతోకొంత సహాయం అందిస్తున్నానని, ప్రచారం కోసం తాను మీడియా ముందుకు ఎన్నడూ రాలేదన్నారు. ఇప్పుడు మీడియా ముందుకు రావడానికి ప్రధాన కారణం...రాష్ట్రంలో ఎంతో మంది దాతలు ఉన్నారని, క్యాన్సర్ రోగులకు వారి ద్వారా సహాయం దొరుకుతుందనే ఉద్దేశ్యంతో మీడియా ముఖంగా ఆర్థిక సహాయం అందించామన్నారు.






