24-01-2026 06:02:14 PM
జిల్లా ఎస్పీ మహేష్ బి గితే
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వజ్రాయుధమని, ఓటు హక్కును వినియోగించుకోవడం మన అందరి బాధ్యత అని జిల్లా ఎస్పీ అన్నారు.జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శనివారం రోజున జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అధికారులు, సిబ్బందితో కలసి ప్రతిజ్ఞ చేశారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.... దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని, ప్రతి ఎన్నికలలో తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని సూచించారు. ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా రాజ్యాంగ స్ఫూర్తిని భావితరాలకు తెలియజేయవచ్చన్నారు.
ప్రపంచ దేశాలలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం కలిగిన భారతదేశంలో ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన బాధ్యత పౌరులుగా మనందరి పైనా ఉన్నదన్నారు. ప్రజలను చైతన్యం చేయడం, వారికి ఓటు విలువ గురించి అవగాహన కల్పించడం ద్వారా ప్రజలంతా ఓటర్లుగా నమోదు చేసుకునేలా కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య,సి.ఐ లు రవి, నాగేశ్వరరావు, ఆర్.ఐ లు మధుకర్,యాదగిరి,ఎస్.ఐ లు,పోలీస్ కార్యాలయ అడ్మినిస్ట్రేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.