16 July, 2026 | 1:42 AM

పల్లెల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

16-07-2026 01:33 AM

ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి 

మధిర, ఎర్రుపాలెం మండలాల్లో రూ.60 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవాలు 

మధిర/ఎర్రుపాలెం, జులై 15 విజయక్రాంతి): గ్రామాల అభివృద్ధినే లక్ష్యంగా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల రాకపోకల ఇబ్బందులను శాశ్వతంగా తొలగించే లక్ష్యంతో, మధిర మరియు ఎర్రుపాలెం మండలాల్లో ఎంపీ లాడ్స్ నిధులు రూ.60 లక్షలతో నూతనంగా నిర్మించిన మొత్తం 14 సీసీ రోడ్లను ప్రారంభించారు. 

మధిర మండలం మాటూరు నుంచి ఆరంభమై ఎర్రుపాలెం రేమిడిచర్లలో ముగిసే..

మధిర మండలం మాటూరు గ్రామం నుండి ప్రారంభమైన ఈ పర్యటన, ఎర్రుపాలెం మండలంలోని రామన్నపాలెం, ఇనగాలి, తక్కెళ్లపాడు, బనిగండ్లపాడు, మీనవోలు, ఎర్రుపాలెం మండల కేంద్రం మరియు రేమిడిచర్ల గ్రామాల్లో కొనసాగింది. వివిధ గ్రామాల్లో సీసీ రోడ్ల ప్రారంభోత్సవాలకు ఎంపీ శ్రీకారం చుట్టారు.

తక్కెళ్ళపాడు గ్రామంలో ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘురాం రెడ్డి మాట్లాడుతూ..ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం, ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నానన్నారు. నేడు ప్రారంభించిన ఈ రోడ్లు గ్రామాల్లోని ప్రజల రాకపోకలకు ఇబ్బందులను తొలగిస్తాయని చెప్పారు. ఎంపీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తన పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత నిస్తున్నానని అన్నారు. 

కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఐలూరి వెంకటేశ్వర రెడ్డి, డాక్టర్ కోటా రాంబాబు, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు, మాజీ మండల అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, మండల అధ్యక్షులు బొగ్గుల శ్రీనివాస్ రెడ్డి, సొసైటీ చైర్మన్ మదన్మోహన్ రెడ్డి, అంకిరెడ్డి, సర్పంచులు ముక్కరి రామకృష్ణారెడ్డి, కూరపాటి రమేష్, అప్పారావు, నండ్రు అశ్విని, బలుసుపాటి జయరావు, కొత్తపల్లి ప్రశాంత్, పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.