calender_icon.png 23 May, 2025 | 6:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హత కలిగిన పేద కుటుంబాలకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి

23-05-2025 01:51:40 AM

  1. శేరుపల్లి పంచాయతీ సెక్రటరికి  షోకాజ్ నోటీసులు

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

పెబ్బేరు, మే 22 :  ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో కిందిస్తాయి ఉద్యోగులు పారదర్శకంగా విధులు నిర్వహించాలని, అర్హత కలిగిన వారికి మాత్రమే ఇల్లు మంజూరుకు సిఫారసు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం ఉదయం ఇందిరమ్మ ఇళ్ల జాబితా ప్రకారం క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు శ్రీరంగాపూర్ మండలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

ముందుగా శ్రీరంగాపూర్ మండలంలోని కంభాళాపూర్ గ్రామంలో వడ్ల భారతమ్మ, శైలజ ఇళ్లను పరిశీలించారు.  అప్లోడ్ చేసే సమయంలో ప్రస్తుతం ఉంటున్న ఇంటి ఫోటోలు కాకుండా ప్లాట్ వద్ద దిగిన ఫొటోలు ఉండటంతో అనుమానం వచ్చిన కలెక్టర్ ఇల్లవద్దకు వెళ్లి స్వయంగా పరిశీలించారు.  ఉన్న ఇల్లు శిథిలావస్తలో ఉండటంతో భారతమ్మ ఇల్లు కూలగొట్టుకోవడం చూసిన కలెక్టర్ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు.

శైలజ సైతం ఇందిరమ్మ ఇంటికి అర్హురాలిగా నిర్ధారించారు. అనంతరం శ్రీరంగాపూర్ గ్రామంలో ఇందిరమ్మ నమూనా ఇంటిని పరిశీలించారు.  నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. శేరుపల్లి గ్రామంలో పర్యటించిన కలెక్టర్ పక్కా గృహంలో ఉంటున్న వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు సిఫారసు చేసినట్లు గుర్తించారు.

క్షుణ్ణంగా పరిశీలించకుండా  అర్హత లేని వారి పేరును ఇందిరమ్మ ఇంటికి సిఫారసు చేసిన పంచాయతీ సెక్రెటరికీ  షోకాజ్ నోటీసులు జారి చేయాలని అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ను ఆదేశించారు. కిందిస్తాయి ఉద్యోగి చేసిన సిఫారసు ను పరిశీలించకుండా అప్లోడ్ చేసినందుకు మండల అభివృద్ధి అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉద్యోగులు పారదర్శకంగా పనిచేయాలని, క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాక ప్రతిపాదనలు సిఫారసు చేయాలని లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి యాదయ్య, హౌసింగ్ డి ఇ విటోభా, తహసిల్దార్ మురళి, ఎంపీడీఓ రవినారాయణ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.