calender_icon.png 30 July, 2025 | 1:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్యుల నిర్లక్ష్యం.. బాలింతకు శాపం

29-07-2025 10:59:02 PM

పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతూ బాలింత మృతి..

పెద్దపల్లి చౌరస్తాలో కుటుంబ సభ్యులు, బంధువుల ఆందోళన..

బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన తాసిల్దార్ రాజయ్య, సిఐ ప్రవీణ్ కుమార్..

పెద్దపల్లి (విజయక్రాంతి): ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న ఓ బాలింత వైద్యుల నిర్లక్ష్యానికి మృతి చెందింది. బంధువులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... పెద్దపల్లి పట్టణానికి చెందిన బాలింత ఉమా(28) పెద్దపల్లి ప్రభుత్వ దవాఖాన(Peddapalli Government Hospital)లో ఐదు రోజుల క్రితం నిండు గర్భిణిగా డెలివరికి వెల్లగా, ఆమె మగపిల్లవానికి జన్మనిచ్చింది. దీంతో చికిత్స పొందుతున్న ఉమాకు ఉన్నట్టుండి దురద రావడంతో వైద్యులు ఇంజెక్షన్ ఇవ్వగా అది వికటించడంతో ఉమా అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన వైద్య సిబ్బంది వెంటనే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఉమా మృతి చెందినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు, ఆమె బంధువులు పెద్దపల్లి లోని సూపర్డెంట్ ను నిలదీశారు.

ఆయన పొంతన లేని సమాధానాలు తెలపడంతో బంధువులకు అనుమానం కలిగి కరీంనగర్ నుంచి ఉమా మృతదేహాన్ని అంబులెన్స్ లో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వస్తుండగా బంధువులు ఆందోళన చేస్తారని గమనించిన వైద్య సిబ్బంది పోలీసులు, భారీ బందోబస్తు మధ్య అంబులెన్స్ లో ఆమె ఇంటికి తీసుకుపోయేందుకు ప్రయత్నం చేయగా గమనించిన కుటుంబ సభ్యులు పెద్ద కాలువల వద్ద రాజీవ్ రహదారిపై ఆందోళన చేపట్టారు.  దీంతో మృతదేహాన్ని పెద్దపల్లి ఆస్పత్రికి తీసుకురాగా, అంబులెన్స్ అడ్డుకొని పట్టణంలోని మజీద్ చౌరస్తా వద్ద కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళన చేస్తున్నారు. పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతికి కారకులైయిన వైద్యులను వెంటనే సస్పెండ్ చేసి అరెస్టు చేయాలని, జిల్లా కలెక్టర్ వచ్చి బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని మృతి చెందిన ఉమా కుమారుడు పసికందుతో బంధువులు ఆందోళన చేస్తున్నారు. దీంతో పెద్దపల్లి తాసిల్దార్ రాజయ్య, సిఐ ప్రవీణ్ కుమార్ బాధిత కుటుంబానికి జిల్లా కలెక్టర్ తో మాట్లాడి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని హామీ ఇవ్వగా బంధువులు ఆందోళన విరమించారు.