22 June, 2026 | 2:00 PM

Breaking News

పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పనులు త్వరగా పూర్తి చేయాలి

05-12-2025 07:26 PM

జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా విద్యాధికారి దీపక్ తివారి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో రహదారులు భవనాలు, పంచాయితీ రాజ్, విద్య, గిరిజన సంక్షేమ శాఖ, ఇంజనీరింగ్ అధికారులు, ఈడబ్ల్యూఐడిసి ఇంజనీరింగ్ అధికారులతో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించే విధంగా అధికారులు కృషి చేయాలని తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల క్రింద ఉన్న పాఠశాలలలో త్రాగునీరు, విద్యుత్, విద్యార్థినీ విద్యార్థులకు వేరువేరుగా మూత్రశాలలు, అదనపు గదుల నిర్మాణం, పాఠశాల భవనాల మరమ్మత్తులు, ఇతర అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని తెలిపారు. బనీతి అయోగ్ కార్యక్రమం క్రింద మంజూరైన పాఠశాలలు, అంగన్వాడి భవనాల నిర్మాణ పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.