21-06-2025 07:28:04 PM
కామారెడ్డి (విజయక్రాంతి): సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సి బాలికల పాఠశాల హాస్టల్ తిరిగి ప్రారంభం కావడంతో విద్యార్థుల పట్ల హాస్టల్ సిబ్బంది కర్కశంగా వ్యవహరించారనే ఆరోపణలు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. హాస్టల్కు ఆలస్యంగా చేరుకున్న తల్లిదండ్రులతో సహా విద్యార్థులను గేటు ముందు మండుటెండలో నిలబెట్టి లోపలికి అనుమతించకుండా దాదాపు గంటల తరబడి వేధించారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వేసవి సెలవుల అనంతరం హాస్టళ్లు తిరిగి తెరుచుకోవడంతో విద్యార్థులు తమ తమ ఊర్ల నుండి హాస్టల్కు బయలుదేరారు.
రవాణా సమస్యలు, గ్రామీణ ప్రాంతాల నుంచి రావాల్సిన దూరం వంటి కారణాల వల్ల కొందరు విద్యార్థులు హాస్టల్కు నిర్దేశించిన సమయం కంటే కాస్త ఆలస్యంగా చేరుకున్నారు. అయితే, హాస్టల్ గేటు కు తాళం వేసి ఉంచిన సిబ్బంది వారిని లోపలికి అనుమతించకుండా అడ్డుకున్నారు. విద్యార్థులు ఎంత వేడుకున్నా, తమ సమస్యలను వివరించినా సిబ్బంది కనికరం చూపలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ, సుమారు నాలుగు గంటల తరబడి విద్యార్థులు గేటు బయటే నిలబడాల్సి వచ్చింది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల పట్ల మానవత్వం లేకుండా వ్యవహరించిన హాస్టల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి, విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు కోరుతున్నారు. విద్యార్థులు భవిష్యత్తుకు పునాదులు వేసుకునే ప్రదేశాల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం విచారకరమని అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై జోనల్ అధికారి పూర్ణచంద్రరావు ను దిశ వివరణ కోరగా... ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమని దీనికి సంబంధించి అధికారులను విచారణకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.