మల్లన్న ప్రసాదంలో పురుగుల అవశేషాలు
చేర్యాల, డిసెంబర్ 1: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ప్రసాదంలో ఆదివారం పురుగుల అవశేషాలు ప్రత్యక్షమవడంతో కలకలం రేగింది. భక్తులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన ఓ భక్తుడు మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకున్న అనంతరం స్వామివారి పులిహోర ప్రసాదం కొనుగోలు చేశాడు. ప్రసాదం తింటుండగా పులిహోరలో పురుగుల అవశేషాలు బయటపడ్డాయి.
పవిత్రంగా భావించే ప్రసాదంలో ఇలా పురుగుల అవశేషాలు రావడం ఏమిటని ఆలయ అధికారులను ప్రశ్నించాడు. కాంట్రాక్టు నిర్లక్ష్యం వల్ల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఆలయ ఈవో బాలాజీని వివరణ కోరగా.. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని.. ప్రసాదం నాణ్యతను సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అని తెలిపారు. ఆలయ పవిత్రతను దెబ్బతీయడానికే ఇలాంటి పుకార్లు సృష్టిస్తున్నారని అన్నారు.




