13-09-2025 07:04:59 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఆటోల చోరీకి పాల్పడిన కేసులో ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర(District SP Rajesh Chandra) తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేట గ్రామంలో ఈనెల 11న అర్ధరాత్రి గ్రామానికి చెందిన తాడేపల్లి కృష్ణకు సంబంధించిన టీఎస్ 15యూసీ 4621 నంబరు బజాజ్ ప్యాసింజర్ ఆటోను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మాల్తుమ్మెద శివారులో శనివారం పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా పోలీసులను చూసి పారిపోతున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకుని విచారించారు. పోలీసుల విచారణలో నాగిరెడ్డిపేట మండలంలో చోరీ చేసిన ఆటో, మెదక్ జిల్లాలో చోరీ చేసిన రెండు ఆటోలు, భిక్కనూర్లో చోరీ చేసిన ఆటో మొత్తం నాలుగు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.