ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ ప్రవేశాల కౌన్సెలింగ్
పరిశీలించిన సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారి మంద మకరందు
ఉట్నూర్,(విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా కొనసాగాలని ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మంద మకరందన్నారు. శనివారం ఉట్నూర్ మండలంలోని లాల్ టెకిడి గిరిజన గురుకుల జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రవేశాల కౌన్సెలింగ్ కార్యక్రమాన్ని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కౌన్సెలింగ్కు హాజరైన విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడి వారికి ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో గురుకుల విద్యాసంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రవేశాల ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్యార్థులకు అవసరమైన సమాచారం స్పష్టంగా అందించి, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కౌన్సెలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించిన ఆయన, తాగునీరు, కూర్చునే వసతి, ధ్రువపత్రాల పరిశీలన వంటి అంశాలు సక్రమంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. అలాగే ప్రవేశాల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుకుల విద్యాసంస్థల అధికారులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.






