ఆరోగ్య ప్రదాత యోగా
గొప్ప సామూహిక శక్తి
ప్రధాని నరేంద్ర మోదీ
కోల్కతాలో అంతర్జాతీయ యోగా వేడుకలు
కోల్కతా, జూన్ 21: యోగా అనేది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని అనుసంధానించే ఒక గొప్ప సామూహిక శక్తిగా ఎదిగిందని, యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చునని భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. వయసుతో సంబంధం లేకుండా శారీరక చలనశీలత, మానసిక ప్రశాంతత, రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడంలో యోగా ఎంతగానో దోహదపడుతుందన్నారు. జాతి, మత, ప్రాంతీయ బేధాలు లేకుండా ప్రపంచంలోని ప్రతిఒక్కరినీ కలిపే అద్భుతమైన శక్తి యోగాకు ఉందని మోదీ తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, శారీరక దృఢత్వాన్ని పెంపొందించే 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆదివారం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్తాలోని చారిత్రక ‘రెడ్ రోడ్’లో ఘనంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరై, వేలాది మంది ప్రతినిధులు, సాధారణ ప్రజలతో కలిసి సామూహిక యోగాసనాల కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దేశ ప్రజలకు మోదీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ‘ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా’ అనే ప్రత్యేక నినాదంతో (థీమ్) నిర్వహించారు. రెడ్ రోడ్లో దాదాపు 35 వేల మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్ రోడ్పై ఏర్పాటు చేసిన బహిరంగ వేదిక నుంచి మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవం నేడు కేవలం ఒక రోజు వేడుకగా కాకుండా, ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక పండుగగా రూపొందిందన్నారు.
భౌగోళిక సరిహద్దులను చెరిపేస్తూ యోగా ఒక ప్రపంచవ్యాప్త ఉద్యమంగా ఎదిగిందన్నారు. యోగా అనేది కేవలం కొన్ని శారీరక వ్యాయామాల కలయిక మాత్రమే కాదని అన్నారు. అది మానవ ఆత్మ అత్యున్నత అభివ్యక్తి అని పేర్కొన్నారు. మారుతున్న జీవనశైలిలో వయసు పైబడిన వారు శారీరకంగా, మానసికంగా, దృఢంగా ఉండటానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
భారతదేశం సంస్కృతిలో భాగమైన యోగాను నేడు ప్రపంచ వ్యాప్తంగా వాడుకలోకి తీసుకురావడం మనందరికీ గర్వకారణమన్నారు. 20 ఏళ్ల కంటే 40 ఏళ్ల వయసులో మరింత దృఢంగా ఉండాలి. ఒత్తిడి రహిత జీవితానికి యోగా ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. మరింత మెరుగైన ప్రపంచం కోసం యోగా ఎంతో అవసరమన్నారు. కాగా కోల్కతాలో వేర్వేరు చోట్ల 10 లక్షల మంది యోగాసనాలు వేసేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.






