నౌకాదళంలోకి మూడు యుద్ధ నౌకలు
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు
జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ
మరింత బలోపేతం కానున్న భారత్ నేవీ
కోల్కతా, జూన్ 21: భారత్ అమ్ములపొదిలో మరో మూడు యుద్ధ నౌకలు చేరాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రయ్ అనే యుద్ధ నౌకలను ఆదివారం కోల్కతాలోని శ్యామ్ప్రసాద్ ముఖర్జీ పోర్టు వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు.
అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రక్షణ రంగంలో స్వావలంబన కోసం భారత్ చేస్తున్న కృషికి ఈ నౌకలు నిదర్శనమని పేర్కొన్నారు. భారతీయ పరిశ్రమల ప్రతిభ, ఇంజినీర్ల నైపుణ్యం, కార్మికుల కఠోర శ్రమ వల్లే వీటి నిర్మాణం సాధ్యమయ్యిందన్నారు. ఈ నౌకల చేరికతో భారత నౌవికాదళం మరింతం కానుందని పేర్కొన్నారు.
ఈ నౌకల ప్రత్యేకత
ఐఎన్ఎస్ దునగిరి : ప్రాజెక్టు 17ఏ పేరిట నిర్మించిన ఐఎన్ఎస్ దుణగిరి యుద్ధనౌక పొడవు 149 మీటర్లు. ఈ నౌకను 2022 జూలై 15న జలప్రవేశం చేయించారు. అడ్వాన్స్డ్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్గా తీర్చిదిద్దారు. రాడార్, సెన్సర్లతో బహుముఖ పాత్ర పోషించేందుకు అనువుగా నిర్మించిన ఈ నౌక బ్రహ్మోస్ యాంటీషిప్ క్రూజ్ క్షిపణులను కలిగి ఉంది.
ఐఎన్ఎస్ సంశోధక్ : ఇది 110 మీటర్ల పొడవుతో ఉంటుంది. 2023 జూన్ 13న జలప్రవేశం చేయించారు. పోర్టులు, లోతైన సముద్ర మార్గాలు, మారిటైం పరిధిలో సముద్ర అధ్యయనం, నావిగేషన్ విధుల కోసం ప్రత్యేక హెలికాఫ్టర్, విపత్కర పరిస్థితుల్లో మానవీయ సాయానికి, రక్షణ చర్యలు చేపట్టేందుకు అనువుగా సంశోధక్ నిర్మాణం చేశారు.
ఐఎన్ఎస్ అగ్రయ్ : 2024 మార్చి 13న ఐఎన్ఎస్ అగ్రయ్ను జలప్రవేశం చేయించారు. ఇది 77.6 మీటర్ల పొడవు ఉంటుంది. తీర జలాల్లో ఆపరేషన్కు అనువుగా డిజైన్ చేశారు. ఉపరితల నిఘా, అన్వేషణ, శత్రువులపై దాడికి స్వీయ ఎయిర్ క్రాఫ్టో సమన్వయం చేసుకునేలా రూపొందించారు. 30ఎంఎం నేవల్ సర్ఫేస్ గన్, వాటర్ జెట్లతో డీజిల్ యంత్రాలను అనుసంధానం చేయడం దీని ప్రత్యేకత.






