భయభ్రాంతులకు గురిచేస్తే సహించేది లేదు
జై భీం, జై బాపు, జై సంవిధాన్ మండల కోఆర్డినేటర్ జీడి వీరస్వామి
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), మార్చి30: నిండు అసెంబ్లీలో దళిత సామాజిక వర్గ ప్రజాప్రతినిధి అయిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని హతమారుస్తామని హెచ్చరించిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్ వెంటనే దళితులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని జై భీం,జై బాపు,జై సంవిధాన్ మండల కోఆర్డినేటర్ జీడి వీరస్వామి డిమాండ్ చేశారు.
సోమవారం మండల కేంద్రం అర్వపల్లిలో విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో దళితులపై అనేక దాడులకు పాల్పడ్డారని,బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితుల ధన,మాన ప్రాణాలకు రక్షణ కరువైందని అన్నారు.ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్,బీజేపీ రెండు పార్టీలు దళిత ప్రజా ప్రతినిధులను టార్గెట్ చేస్తూ,గత కొద్ది రోజుల క్రితం తెలంగాణ ఉద్యమకారుడు, తుంగతుర్తి శాసనసభ్యుడు మందుల సామేలు ఇంటిపై దాడి చేయగా, నేడు సీనియర్ దళిత ప్రజా ప్రతినిధి అయిన కడియం శ్రీహరిని హతమారుస్తాం... అని నిండు సభలో పాడి కౌశిక్ రెడ్డి సైగలు చేయడం ఏంటని దుయ్యబట్టారు.
బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు దళితులు అంటే ఎందుకింత కక్షో అర్థం కావడం లేదని ప్రశ్నించారు.రాష్ట్రంలో దళిత ప్రజాప్రతినిధులకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు.జరుగుతున్న అన్ని సంఘటనలను తెలంగాణ దళిత సమాజం మౌనంగా గమనిస్తుందని, సరైన సమయంలో ఈ రెండు పార్టీలకు సరైన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. రాష్ట్రంలోని దళిత ప్రజా ప్రతినిధుల రక్షణ కొరకు ప్రత్యేక భద్రతను కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడిపెల్లి వెంకట్ రెడ్డి,కొణతం వెంకట్రాంరెడ్డి, నల్లగుంట్ల నాగేందర్,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




