09-04-2025 02:20:50 AM
ఇంజినీర్లతో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సమీక్ష
మునుగోడు, మార్చి 8 : బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు నుంచి మునుగోడు మండలంలో 25 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్లోని తన నివాసంలో నీటిపారుదల ఇంజినీర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. బ్రాహ్మణవెల్లంల నుంచి మునుగోడు మండలం ఉరుమడ్ల నుంచి ప్రాజెక్ట్ ఎడమ ప్రధాన కాల్వను కిష్టాపురం వరకు 11.5 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు అంచనాలు రూపొందించాలని సూచించారు.
అవసరమైతే కిష్టాపురం చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా మార్చి అక్కడి నుంచి ఎగువప్రాంతానికి ఎత్తిపోతల సాయంతో నీరందించాలన్నారు. కిష్టాపురం వరకు ప్రధాన కాల్వకు అనుసంధానంగా డిస్ట్రిబ్యూటరీ కాల్వలను తవ్వేందుకు వెంటనే భూసేకరణ వెంటనే పెట్టాలని చెప్పారు.
బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టులో సరిపడా నీరుండేలా పానగల్లు ఉదయ సముద్రం నుంచి నీటిని తరలించి వానాకాలం ఆయకట్టుకు నీరందించాలన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తయిన తర్వాత కృష్ణానీటిని సమృద్ధిగా వాడుకునేందుకు పానగల్లు ఉదయ సముద్రం, బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచుతామన్నారు. సమీక్షలో నీటిపారుదల ఈఈ శ్రీనివాస్ రెడ్డి, డీఈ విఠలేశ్వర్, ఏఈఈ నవీన్ కుమార్ పాల్గొన్నారు.