19-06-2025 12:00:00 AM
మిషన్ భగీరథ నీటి సరఫరా తీరు ఇలా
పట్టించుకోని అధికారులు..
ఆందోళన చెందుతున్న ప్రజలు
బెల్లంపల్లి అర్బన్, జూన్ 18: రక్షిత మంచినీటి పథకం మిషన్ భగీరథ నీరు కలుషితం ప్రజలను గగ్గోలు పెట్టిస్తుంది. పైప్ లైన్ లీకేజీలు, గేట్వాల్ పనితీరుపై అధికారుల పర్య వేక్షణ పడకేసింది. దీంతో ప్రజలకి కలుషిత తాగునీరే దిక్కయింది. బెల్లంపల్లి నియోజవర్గంలోని కన్నెపల్లి మండలంలో మిషన్ భగీరథ తాగునీటి సరఫరా తీరుపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కన్నెపల్లి మండలంలోని సూర్జాపూర్, బావాపూర్, జంగం పల్లి గ్రామాల్లో తాగునీటి సరఫరా పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. మిషన్ భగీరథ అధికారులు తాగునీటి సరఫరాపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా రనీ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వ్యాధులు పొంచి ఉన్న వర్షాకాలం లో తాగునీటి పరిస్థితి ఇలా ఉంటే గ్రామీణ ప్రజలు రోగాల బారిన పడటం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గత ఆరు నెలలుగా తాగు నీటి సరఫరా తీరులో నెలకొన్న ఈ పరిస్థితిపై ఆయా గ్రామాల ప్రజలు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా రు. అయినప్పటికీ అధికారులు కనికరించడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కలుషిత తాగునీటి నుంచి తమను కాపాడాలని గ్రామీణ ప్రజలు ప్రజాప్రతినిధులు, అధికారులను వేడుకుంటున్నారు. మరమ్మతు పనులు తక్షణమే చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. కలుషిత నీటిని నివారించేందుకు అధికారులు పైప్లైన్ వ్యవస్థపై ఇక నుంచైనా అనునిత్యం పర్యవేక్షణ ఉంచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
చాలా సార్లు ఫిర్యాదు చేశాం
తాగునీటి కలుషితంపై చాలా సార్లు ఫిర్యాదు చేశాం. అధికారులు పట్టించుకో వడం లేదు. పైపులైను, గేట్ వాల్ లీకేజీని నివారించాలని కోరినప్పటికీ అధికారులు పట్టించుకోవ డం లేదు. కలుషిత నీటీనీ తాగుతున్నాం. ఇప్పటికైనా అధికారులు పైప్ లైన్, గేటు వాల్ లీకేజ్ని నివారించాలి. వెంటనే తగి న మరమ్మత్తు పనులు చేపట్టాలి.
రాచర్ల మహేష్, సూర్జాపూర్ గ్రామస్తుడు