21-06-2025 12:35:48 AM
గజ్వేల్, జూన్ 20: రైతుల వ్యవసాయ అవసరాలకు, గ్రామాలలో ప్రజలకు విద్యుత్ సరఫరాకు వినియోగించాల్సిన ట్రాన్స్ఫార్మర్లు కాంట్రాక్టర్ అధీనంలో ఉండిపోయాయి. గజ్వేల్ పట్టణంలో నివాసం ఉంటున్న, మర్కుక్, వర్గల్ మండలాల్లో విద్యుత్ శాఖ పనుల నిర్వహించే కాంట్రాక్టర్ ఇంటి పరిసరాల్లో రెండు త్రీఫేస్ ట్రాన్స్ఫార్మర్లు, ఐదు సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి.
విద్యుత్ శాఖ ఏఈ అధీనంలో గాని, ఎస్పీఎం సెంటర్లో లేనిపక్షంలో జిల్లా స్టోర్స్ లో ఉండాల్సిన ట్రాన్స్ఫార్మర్లు కాంట్రాక్టర్ ఇంటి ఆవరణలో ఉండడం గమనార్హం. రోజులు, నెలల తరబడి కాంట్రాక్టర్ వద్దనే ట్రాన్స్ఫార్మర్లను ఉంచడం పట్ల ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్లను ప్రజల అవసరాల కోసం వినియోగించడానికా లేక అమ్ముకోవడానికి కాంట్రాక్టర్ అధీనంలో విద్యుత్ శాఖ ఉంచిందా అన్న విషయం చర్చనీయాంశంగా మారింది.
ప్రజలు తమ అవసరాల కోసం కష్టించి సంపాదించుకున్న డబ్బులను డీడీలు కడితే గాని ట్రాన్స్ఫార్మర్లు అందించని విద్యుత్ శాఖ ఓ కాంట్రాక్టర్ అధీనంలో ట్రాన్స్ఫార్మర్లను ఉంచడం ఆయా మండలాల ఏఈలు, ఏడీల నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుంది. అధికారుల అధీనంలో ఉండాల్సిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాంట్రాక్టర్ల అధీనంలో ఉండడానికి అధికారుల అక్రమ వసూళ్లే కారణమేమో అని ప్రజలు భావిస్తున్నారు.
గజ్వేల్ ప్రాంతంలో ఉన్నట్లుగా ఇంకా ఎన్ని ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు నిరుపయోగంగా ఉన్నాయో అంటూ పలువురు చర్చించుకోవడం కనిపించింది. ఉన్నతాధికారులు ఈ విషయంలో కఠినంగా వ్యవహరించి ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.