21-06-2025 12:49:07 AM
హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక మనదేశం ప్రపంచానికిచ్చిన అద్భుత బహుమతి యోగా అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచవ్యా ప్తంగా 200 దేశాలు యోగాను గుర్తించి, ఆచరిస్తున్నారని తెలిపారు. ఇది ప్రతీ భారతీయు డు గర్వించదగిన విషయమన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం ఎల్బీ స్టేడియంలో 24 గంటల కౌంట్డౌన్ కార్యక్రమం సందర్భంగా కిషన్రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ జాతీయ నేత ఖుష్బూ, సినీనటులు సాయిదుర్గ తేజ్, తేజ సజ్జ, మీనాక్షి చౌదరి, సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
భాగ్యనగర్ వాసులు పెద్దఎత్తున తరలొచ్చి యోగాసనాలు వేశారు. యోగాను ప్రపంచానికి పరిచయం చేసినందుకు ప్రధాని మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు కిషన్రెడ్డి పేర్కొన్నారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అన్ని ప్రాంతాల్లో వేడుకగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో 5 లక్షలమందితో కలిసి యోగాలో పాల్గొనటం సంతోషకర విషయమన్నారు.
యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలన్నారు. మానసికంగా, శారీరకంగా బాగుంటే మన ఆరోగ్యం బాగుంటుందని.. కుటుంబం, సమాజం, ప్రపంచం బాగుంటాయన్నారు. యోగానే మనకు ప్రథమ డాక్టర్ అని... సర్వరోగ నివారిణి అని తెలిపారు. యోగా పాటించినట్లయితే జీవితంలో మెరుగైన ఫలితాలు వస్తాయని.. అందుకే యోగాను ప్రతిఒక్కరూ ఆచరించాలని కోరుతున్నామన్నారు.