calender_icon.png 14 June, 2025 | 6:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి బాంబుల వర్షం

14-06-2025 01:14:43 AM

  1. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట దాడులు
  2. ఇరాన్ రెవల్యూషన్ గార్డ్ చీఫ్ మేజర్ జనరల్ సలామీ మృతి
  3. ఇరాన్ మిలటరీ చీఫ్ మహమ్మద్ బాఘేరి కూడా..
  4. -- . 100 డ్రోన్లతో ప్రతిదాడులకు దిగిన ఇరాన్
  5. అణుఒప్పందానికై ఒత్తిడి చేస్తున్న అమెరికా
  6. ఆందోళన వ్యక్తం చేసిన భారత్

న్యూఢిల్లీ, జూన్ 13: మధ్యప్రాచ్యంలో కీలకంగా ఉన్న ఇజ్రాయెల్ శుక్రవారం తన పొరు గుదేశమైన ఇరాన్‌పై ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ను ప్రారంభించింది. ఇరాన్ అణుకర్మాగారాలే లక్ష్యంగా వరుసదాడులు చేసింది.  ప్రతిగా ఇరాన్ కూడా డ్రోన్లతో దాడులకు దిగి.. ఇజ్రాయెల్‌కు భారీ నష్టాన్ని కలిగించింది. డ్రోన్ దాడులను ఇజ్రాయెల్ సైన్యం సమర్థవంతంగా ఎదుర్కొన్నప్పటికీ భారీ నష్టం జరిగినట్టు తెలుస్తోంది.

ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ పారామిలటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ మేజర్ జనరల్ హొస్సేన్ సలా మీ, ఇరాన్ మిలటరీ చీఫ్ మహమ్మద్ బాఘేరి, ఖాటం అల్ అన్‌బియా సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్ కమాండర్ రషీద్, ఐఆర్‌జీసీ ఎయిర్‌ఫోర్స్ కమాండర్ అమీర్ అలీ, ప్రముఖ అణుశాస్త్రవేత్తలు మరణించారు. పెద్దన్నలాంటి అమెరికా హెచ్చరికలను కూడా ఇజ్రాయెల్ పెడచెవిన పెట్టి దాడులకు దిగడం గమనార్హం.

ఈ దాడులపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఇరాన్ అణ్వాయుధ కార్యకలాపాలను ఆపేందుకే ఆపరేషన్‌ను చేపట్టినట్టు పేర్కొన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ స్పందిస్తూ.. ఇజ్రాయెల్‌కు కఠిన శిక్ష విధిస్తామని హెచ్చరించారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ కూడా తీవ్రస్వరంతో హెచ్చరికలు జారీ చేశారు. ఇదే అదనుగా భావించిన అమెరికా ఇరాన్ తమతో అణుఒప్పందం చేసుకోవాలని పట్టుబడుతోంది. 1980లో ఇరాక్‌తో యుద్ధం తర్వాత ఇరాన్ మీద జరిగిన అతి పెద్ద దాడి ఇదే.  

అణుకర్మాగారాలే లక్ష్యంగా.. 

ఇటీవల ఇరాన్ అధిక మొత్తంలో శుద్ధి చేసిన యురేనియం ఉత్పత్తి చేస్తోంది. ఈ యురేనియంతో చాలా అణు బాంబులను తయారు చేయొచ్చు. అణుఒప్పందం విషయంలో ఇరాన్ ప్రపంచంలో ఏ దేశం వారించినా, సూచించినా కానీ పెడ చెవిన పెడుతూ వస్తోంది. అణుబలం చూసుకుని ఇరాన్ పొరుగుదేశాలు మరీ ముఖ్యంగా ఇజ్రాయెల్‌కు బహిరంగంగానే సవాల్ విసురుతోంది. దీంతో ఇజ్రాయెల్ శుక్రవారం ఇరాన్ అణుస్థావరాలపై విరుచుకుపడింది.

మొదట వైమానిక దాడులు చేసిన ఇజ్రాయెల్ క్రమక్రమంగా దాడుల తీవ్రతను పెంచింది. ఇరాన్ ప్రధాన యురేనియం శుద్ధి కేంద్రం అయిన నతాన్జ్‌ను నాశనం చేసింది. ఇరాన్‌పై దాడులను ఐడీఎఫ్ దళాలు కూడా ధృవీకరించాయి. ఇజ్రాయెల్ దాడులతో తేరుకున్న ఇరాన్ దాదాపు 100 డ్రోన్లతో ప్రతిదాడులకు దిగి.. ఇజ్రాయెల్‌కు తీవ్ర నష్టాలను మిగిల్చింది. ఇరాన్ దాడులతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ తన పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. 

రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ మృతి..

ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ మేజర్ జనరల్ హొస్సేన్ సలామీతో పాటు మరికొంత మంది ఉన్నతాధికారులు, అణుశాస్త్రవేత్తలు కూడా మరణించారు. సలామీ మృతిని ఇరాన్ అధికారిక మీడియా కూడా ధ్రువీకరించింది. టెహ్రాన్‌లోని ఐఆర్‌జీసీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల్లో ఇరాన్ మిలటరీ చీఫ్ మహమ్మద్ బాఘేరి కూడా మృతి చెందినట్టు ప్రభుత్వ మీడియా సంస్థ ఐఆర్‌ఎన్‌ఎన్ ధ్రువీకరించింది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఆరుగురు ప్రముఖ అణుశాస్త్రవేత్తలు, సీనియర్ కమాండర్స్ మరణించారు. 

కఠిన శిక్ష విధిస్తాం: ఖమేనీ 

ఈ దాడులపై ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ స్పందించారు. టెల్ అవీన్ కు కఠిన శిక్ష విధిస్తామని హెచ్చరించారు. ‘నివాస ప్రాంతాలపై దాడులు చేసి ఇజ్రాయెల్ తన దుర్మార్గపు స్వభావాన్ని మరోసారి బహిర్గతం చేసుకుంది. ఇజ్రాయెల్‌పై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం. ఇంత కంటే తీవ్రమైన పరిస్థితిని ఇజ్రాయెల్ ఎదుర్కోబోతుం ది.’ అని ఖమేనీ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ ఫెజెస్కియాన్ కూడా ఇజ్రాయెల్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్‌పై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో దాదాపు 50 మంది గాయపడ్డట్టు తెలుస్తోంది. వీరిలో 35 మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. వీరందరినీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 

అలర్ట్ అయిన ఇరాక్.. 

ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతల దృష్ఠ్యా ఇరాన్ పొరుగునే ఉన్న ఇరాక్ అప్రమత్తమైంది. ముందస్తుగా తమ గగనతలాన్ని మూసేసి.. దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలను నిలిపేసింది.  

తప్పనిసరి పరిస్థితుల్లోనే దాడులు.. 

ఈ దాడులపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ జమీర్ స్పందిస్తూ.. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ దాడులు చేసినట్టు పేర్కొన్నారు. ‘దాడి చేసేందుకు ఇంకో సందర్భం కోసం మేం ఎదురు చూడలేం. ఇదే సరైన సమయం. మాకు మరో అవకాశం లేదు. మమ్మల్ని నాశనం చేయాలని అనుకునే వారి ముందు అస్సలుకే తలవం చం. మా అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు పో రాడుతూనే ఉంటాం.’ అని పేర్కొన్నారు. 

ఇప్పటికైనా ఒప్పందం చేసుకోండి.. 

ఇజ్రాయెల్ వరుస దాడులతో విరుచుకుపడుతుంటే అమెరికా అణుఒప్పందం చేసుకో వాలంటూ ఇరాన్ పై ఒత్తిడి తెస్తోంది. ట్రంప్ సోషల్ మీడియా లో స్పందించారు. ‘అమెరికాతో అణుఒప్పం దం కుదుర్చుకునేందు కు ఇరాన్‌కు అనేక అవకాశా లు ఇస్తూ వచ్చాను. ఎన్ని సార్లు సూచించినా టెహ్రాన్ పెడచెవిన పెట్టింది. ఇజ్రాయెల్ వద్ద ప్రాణాంతక ఆయుధాలు ఉన్నాయి. భవిష్యత్‌లో మరిన్ని దాడు లు జరిగే అవకాశం ఉంది.’ అని అన్నారు. 

భారత్ ఆందోళన.. 

ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్త పరిస్థితులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘దాడులను నిశితంగా పరిశీలిస్తున్నాం. రెండు దేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాలతో సంప్రదింపులు జరుపుతున్నాం. పౌరులంతా ఉండాలి. ’ అని తెలిపింది. 

మా మనుగడనే సవాల్ చేస్తారా? 

ఇరాన్‌పై ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో దాడులు చేయడాన్ని ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు సమర్థించారు. మా మనుగడను సవాల్ చేసిన ఇరాన్ అణులక్ష్యాలను దెబ్బతీసేందుకే ఈ ఆపరేషన్ ప్రారంభించామని వెల్లడించారు. ‘ఆ దేశ అణుకార్యక్రమానికి గుండెలాంటి ప్రదేశాలు ధ్వంసం చేశాం. ఇరాన్ ముప్పును తిప్పికొట్టేందుకే ఈ ఆపరేషన్ చేపట్టాం. ఇరాన్ ముప్పును పూర్తిగా తొలగించే వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుంది.

ఇటీవలి కాలంలో ఇరాన్ అధిక మొత్తంలో శుద్ధి చేసిన యురేనియం ఉత్పత్తి చేస్తూ.. ప్రపంచదేశాలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. గత కొద్ది నెలలుగా ఇరాన్ దూకుడుగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు ఆ దేశాన్ని ఆపకపోతే మరింత కష్టం అవుతుంది. ఇరాన్ బెదిరింపులకు ప్రతిచర్య చేపట్టాం. నతాన్జ్‌లోని అణుశుద్ధి కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాం. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి ప్రోగ్రామ్‌కు కేంద్రమైన ప్రాంతాన్ని ధ్వంసం చేశాం.’ అని పేర్కొన్నారు. 

మోదీకి ఫోన్ చేసిన నెతన్యాహు 

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నుంచి ఫోన్ వచ్చినట్టు శుక్రవా రం భారత ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఇందుకు సంబంధించి ప్రధా ని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘ఇజ్రాయెల్ ప్ర ధాని నెతన్యాహు నుంచి ఫోన్ వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల గురించి ఆయన పూ ర్తిగా వివరించారు. ఇజ్రాయెల్, ఇరాన్  ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించాలని చెప్పాను.’ అని పోస్ట్ చేశారు. 

నెతన్యాహు కేవలం ప్రధాని మోదీకి మాత్రమే కాకుండా ఇతర దేశాల అధినేతలకు కూడా కాల్ చేసి పరిస్థితులు వివరించారు. జర్మనీ చాన్స్‌లర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు, రష్యా అధ్యక్షుడు, బ్రిటన్ ప్రధాని మొదలైన వారితో సంభాషించినట్టు ప్రధాని కార్యాలయం ఎక్స్‌లో పేర్కొంది.