23-04-2025 08:49:49 PM
బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి..
హుజురాబాద్ (విజయక్రాంతి): మతం పేరుతో మరణహోమం సృష్టించాలనుకోవడం అవివేకమని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారిపై బుధవారం హుజరాబాద్ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు ఆధ్వర్యంలో పహల్గాములో ఉగ్రవాద దాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పిస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాద దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ కార్యక్రమానికి బిజెపి జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జమ్ము కాశ్మీర్ పాల్గామ్ లో ఉగ్రవాద దాడిని ఖండిస్తున్నామన్నారు. మంజుల కుటుంబానికి రగడ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కులమత బేధాలు లేకుండా కలిసిమెలిసి బతుకుతున్న భారత దేశంలో మతం పేరుతో ఉగ్రముఖాలు మరణ హోమం సృష్టించాలనుకోవడం అవివేకం అన్నారు.
పర్యాటకులను, సామాన్య ప్రజలను చుట్టుముట్టి ఆటవికంగా హత్య చేసి గెలిచామనుకోవడం పిరికిపందల చర్యగా అభివర్ణించారు. ఉగ్ర మూకల దాడిలో ఆగిన ఊపిరి ప్రతి భారతీయుల్లోనూ ఉద్రేకాన్ని రగిలించిందన్నారు. ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో మతం ముసుగులో దాడి చేసిన మతోన్మాద ఉగ్రవాదుల చర్యలను, దాడిని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయని అన్నారు. ఉగ్రమూకల రియాక్షన్ కు భారత ప్రభుత్వం సరైన సమాధానం చెప్పే పనిలో ఉందనీ, ఉగ్రవాదులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.