29-01-2026 03:55:00 PM
ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): బీఆర్ఎస్ అధినేత,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి సిట్ నోటీసులు ఇవ్వడం సరికాదని బీఆర్ఎస్ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి అన్నారు. కేసీఆర్ కి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని గురువారం ఒక ప్రకటన లో మాజీ మంత్రి లక్ష్మా రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి,పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్ష్య సాధింపు చేస్తుందని విమర్శించారు.
బొగ్గు స్కాంపై సమాధానం చెప్పే దమ్ములేకనే సీఎం రేవంత్ వరుసగా నోటీసుల డ్రామా ఆడుతున్నాని పేర్కొన్నారు. పాలనా వైఫల్యం,కాంగ్రెస్ వరుస స్కాంల నుంచి దృష్టి మళ్లించేందుకే సిట్ నోటీసులు ఇచ్చిందని తెలిపారు. ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కేసులు పెట్టినా బిఆర్ఎస్ నాయకులు సింహాల్లా గర్జిస్తూనే ఉంటారన్నారు. కేసిఆర్ వెంట తెలంగాణ సమాజం అంతా ఉందని, మీ కేసులకు,నోటీసులకు భయపడేది లేదని ధీమావ్యక్తం చేశారు. అక్రమ కేసులపై ప్రజా క్షేత్రంలోనే బీఆర్ఎస్ తేల్చుకుంటుందన్నారు.