ఐటీఐఆర్ను వెనక్కి తేవాలి
రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కృషి చేయాలి
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): యూపీఏ హయాంలో రాష్ట్రానికి మంజూరు చేసిన ఐటీఐఆర్ను ఆ తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం వేరే రాష్ట్రానికి తరలించిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపా రు. ఇప్పుడు కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్కుమార్ కలిసి ఐటీఐఆర్ను రాష్ట్రానికి తీసుకురావాలని డిమాండ్ చేశా రు. కేంద్రమంత్రులు హైదరాబాద్కు వచ్చా క వారిని కలిసి వినతిపత్రం అందజేస్తానని తెలిపారు. గాంధీభవన్లో బుధవారం మాట్లాడుతూ.. ఐటీఐఆర్ రద్దుతో తెలంగాణ యువకులకు 15 లక్షల ఉద్యోగాలు రాకుండా పోయాయన్నారు. కేంద్రంలో తిరిగి ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలోకి వచ్చినందున ఆ ప్రాజెక్టును రాష్ట్రానికి తీసుకురావాలన్నారు.
హైదరాబాద్కు ఆనుకొని ఉన్న నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు బీజేపీనే గెలిచిందన్నారు. బీజేపీ ఎంపీ రఘునందన్రావు తనకు ఐటీఐఆర్ గురించి తెలియదని అంటున్నారని, తనలో ఏమైనా లోపాలు ఉంటే విమర్శలు చేస్తే ఒప్పుకుంటానని అన్నారు. “నాకు మీ అంత చదువు లేదు. విద్యాపరంగా చాలా వీక్. నేను ఇంటర్ వరకే చదివాను. రఘునందన్రావు అడ్వొకేట్. ఆయనకు చాలా తెలివి ఉంది. ఆయన పుస్తకాలు చదివితే.. నేను జీవితాన్ని చదివాను. మెరిట్ స్టూడెంట్కు అనుభవాలు ఉండవు.
తల్లిపాలు తాగి తల్లి రొమ్మును గుద్దాడని అంటున్నారు. నేను ఆర్ఎస్ఎస్ శాఖకు వెళితే తప్పేముంది. నేను శాఖకు వెళ్లేటప్పుడు రఘునందన్ ఎక్కడున్నారు. శాఖల గురించి ఆయనకు తెలియదు. ఆయన డైరెక్టు వచ్చారు కాబట్టే ఏమి తెలియదు. జగ్గారెడ్డి గురించి కిషన్రెడ్డికి, దత్తాత్రేయకు తెలుసు. బీజేపీలో రఘునందన్రావుకు అనుభవం తక్కువ. ఆ రోజుల్లో తల్లిపాత్ర జగ్గారెడ్డిది. బీజేపీది కాదు. నా కష్టం మీదనే నేను ఎదిగాను. నేను రాజకీయం చేస్తున్నప్పుడు రఘునందన్రావు గల్లీలో గోళీలు అడుకుంటున్నారు. మరోసారి నా జోలికి వస్తే బీజేపీలోని కుళ్లు కుతంత్రాలు చర్చకు పెడుతా” అని జగ్గారెడ్డి హెచ్చరించారు. సోనియాగాంధీ రాష్ట్రానికి ఐటీఐఆర్ ఇచ్చినప్పుడు రఘునందన్రావు టీఆర్ఎస్లో ఉన్నారని గుర్తుచేశారు.






