12-06-2025 01:05:22 AM
హైదరాబాద్, జూన్ 11(విజయక్రాంతి): వేసవి సెలవులు ముగియడంతో గురువారం నుంచి స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు విద్యార్థులకు వేసవి సెలవులివ్వడంతో మూగబోయిన బడిగంటలు మళ్లీ మోగను న్నాయి. నిన్నటి వరకు ఆటపాటలతో వేసవి సెలవులను గడిపిన విద్యార్థులు, ఇక భుజాన బ్యాగులేసుకొని స్కూళ్లకు వెళ్లనున్నారు.
ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరంపై ప్రత్యేక దృష్టిసారించింది. ఈనెల 6 నుంచి ప్రారంభమైన బడిబాటలో భాగంగా బడీడు పిల్లలను స్కూళ్లలో చేర్పించుకుంటున్నారు. భారీగా ప్రవేశాలు నమోదు చేసేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఈ ఏడాది నుంచి కొత్త బోధనా పద్ధతుల ద్వారా గురువులు విద్యార్థులకు పాఠాలు బోధించనున్నారు. మూస పద్ధతుల్లో కాకుండా విద్యార్థులకు అర్థమయ్యేలా బోధన చేసేలా టీచర్లకు తర్ఫీదిచ్చారు.
ఎన్నడూలేనంతగా ఐదు రోజుల పాటు 1.12 లక్షల మంది టీచర్లకు విద్యాశాఖ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. విద్యార్థుల్లో సామర్థ్యాలను పెంచేలా ఎఫ్ఎల్ఎన్, ఎల్ఐపీ కార్యక్రమాలను రూపొందించారు. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థుల కోసం ఏఐ పాఠ్యాంశాలను ప్రవేశపెడుతున్నారు.
పండుగ వాతావరణంలో స్వాగతాలు..
రాష్ట్రంలోని మొత్తం 26,106 ప్రభుత్వ బడుల్లో 18.79 లక్షల మంది విద్యార్థులుండగా, 11,757 ప్రైవేట్ పాఠశాలల్లో 37.26 లక్షల మంది విద్యార్థులున్నారు. దాదాపు 50 రోజుల వేసవి సెలవుల తర్వాత విద్యార్థులు బడులకు రానున్నారు. అంతేకాకుండా ఈసారి కొత్తగా పాఠశాలల్లో చేరే విద్యార్థులకూ స్వాగతం పలికేలా బడుల్లో ఏర్పాట్లు చేశారు. ప్రతీ పాఠశాల వద్ద పండుగ వాతావరణం నెలకొనేలా ఏర్పాట్లు చేశారు.
ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్థులను బడులకు స్వాగతించేలా అధికారులు ఆదేశించడంతో వాటికి సంబంధించిన ఏర్పాట్లను పాఠశాలల హెచ్ఎంలు చేశారు. ఇక పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్లు ఉచితంగా అందించనున్నారు. పుస్తకాలు ఇప్పటికే స్కూళ్లకు చేరినట్టు అధికారులు తెలిపారు. ఈరోజే వీటిని పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
మరోవైపు ప్రైవేట్ పాఠశాలలు కూడా నేటి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. కొన్ని పాఠశాలలు హైస్కూల్ విద్యార్థులకు జూన్ 2 నుంచే తరగతులను ప్రారంభించాయి. మిగిలిన వారికి ఈరోజు నుంచి షురూకానున్నాయి. ప్రైవేట్ స్కూళ్లలో ఇక నుంచి ఫీజుల మోత మోగనుంది. ఇప్పటికే కొన్ని పాఠశాలలు ఫస్ట్ టర్మ్ ఫీజులను తల్లిదండ్రులతో కట్టించుకున్నాయి.