19-11-2024 01:26:01 AM
ఆప్కు రాజీనామా చేసిన మరుసటి రోజే మార్పు
న్యూఢిల్లీ, నవంబర్ 18: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో ఆమ్ఆద్మీ పార్టీ విఫలమైందని ఆరోపిస్తూ ఆదివారం ఆ పార్టీకి రాజీనామా చేసిన కైలాశ్ గహ్లోత్.. సోమవారం బీజేపీలో చేరారు. ఢిల్లీ రవాణా శాఖమంత్రిగా పనిచేసిన గహ్లోత్ ఆదివారం ఆప్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కేజ్రీవాల్కు పంపిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కేంద్రమంత్రి మనోహర్ లాల్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయవంత్ పాండ సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా గహ్లోత్ మాట్లాడుతూ.. ఎవరి ఒత్తిళ్లతోనే తాను ఈ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఆప్ పార్టీ వైఫల్యాలు నచ్చకనే తాను ఆ పార్టీని వీడినాని.. మోదీ విజన్ నచ్చడంతోనే బీజేపీలో చేరానని గహ్లోత్ స్పష్టం చేశారు.
ఎక్కడైనా వెళ్లనీ..: కేజ్రీవాల్
గహ్లోత్ బీజేపీలో చేరిన విషయంపై ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. గహ్లోత్ సొంత నిర్ణయాలు తీసుకోగలరు. ఆయన స్వేచ్ఛగానే ఉన్నారు. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లవచ్చు. అందులో అభ్యంతరమేమీ లేదు అని వ్యాఖ్యానించారు. ఆప్ సీనియర్ నేత దుర్గేశ్ పాఠక్ మాట్లాడుతూ.. మాజీ మంత్రి ఈడీ, ఐటీ ప్రశ్నిస్తుంటే ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఆప్ పార్టీని వీడారు. బీజేపీలో చేరితే కేసులన్నీ పోయి క్లీన్చిట్ వస్తుందనే ధీమాతో పార్టీ ఫిరాయించారు అని ఆరోపించారు.