సేవ కార్యక్రమాల్లో ముందుండాలి
కేయు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ నారాయణ
మంచిర్యాల,(విజయక్రాంతి): ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సేవా కార్యక్రమాలతో పాటు ప్రజలకు మంచి, చెడులు అవగాహన కల్పించడంలో ముందుండాలని కాకతీయ యూనివర్సిటీ (కేయు) జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) కోఆర్డినేటర్ ప్రొఫెసర్ నారాయణ(KU NSS Coordinator Professor Narayana) అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వివేకవర్ధిని డిగ్రీ కళాశాలలో కేంద్ర ప్రభుత్వ యువజన, క్రీడల మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ సేవా పథకం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రోగ్రామ్ అధికారుల సమావేశం, రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో హెచ్ఐవీ, ఎయిడ్స్ వ్యాధుల నిర్మూలన కోసం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధి నివారణ కోసం చేపట్టవలసిన చర్యల గురించి వివరించారు. ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు. ప్రోగ్రామ్ అధికారులకు 2025-26 యాక్షన్ ప్లాన్ తో పాటు రెగ్యులర్ యాక్టివిటీస్, స్పెషల్ క్యాంపులపై అవగాహన కల్పించారు. అనంతరం వాలంటీర్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు.






