24-11-2025 09:38:02 AM
కొల్లం: కేరళలోని(Kerala) కొల్లంలో భర్త భార్యను దారుణంగా హత్య చేశాడు. సోమవారం తెల్లవారుజామున మాంగాడ్లో 45 ఏళ్ల మహిళపై భర్త ఎల్పిజి సిలిండర్తో దాడి చేయడంతో ఆమె మరణించిందని పోలీసులు వెల్లడించారు. మృతురాలిని మంగాడ్లోని కారికోడ్లోని అపోలో జంక్షన్ సమీపంలో నివసించే కవితగా గుర్తించారు. అర్ధరాత్రి సమయంలో వారి ఇంట్లో జరిగిన గొడవ తర్వాత ఆమెపై దాడి చేసిన ఆమె భర్త మధుసూదనన్ పిళ్లైని పోలీసులు అరెస్టు చేశారు. ఎఫ్ఐఆర్ ప్రకారం, ఈ సంఘటన తెల్లవారుజామున 12.30 గంటల ప్రాంతంలో జరిగిందని, పిళ్లై కవిత తలపై గ్యాస్ సిలిండర్తో పలుసార్లు కొట్టాడని తెలుస్తోంది.
సంఘటన జరిగిన సమయంలో ఆ దంపతుల కుమార్తె ఇంట్లోనే ఉందని పోలీసులు తెలిపారు. పెద్ద శబ్దాలు విని ఇరుగుపొరుగు వారు ఇంటికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా కవిత హాలులో అపస్మారక స్థితిలో పడి ఉంది. సమీపంలోని వైద్యుడిని పిలిపించి చూపించగా ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యుడు నిర్ధారించారు. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు పిళ్లైని అరెస్టు చేసి కిలిక్కొల్లూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.