రీఎంట్రీ ఆలోచన లేదు
టెస్ట్ క్రికెట్పై తేల్చేసిన కోహ్లీ
ముంబై, జూన్ 22: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి టెస్ట్ ఫార్మాట్ అంటే చాలా ఇష్టం. అలాంటి కోహ్లీ గత ఏడాది హాఠాత్తుగా రెడ్బాల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరో మూడేళ్లు ఆడే సత్తా ఉన్నా కింగ్ అనూహ్యంగా తప్పుకున్నాడు. అయితే కోహ్లీ మళ్లీ టెస్ట్ క్రికెట్లోకి పునరాగమనం చేస్తాడంటూ వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తన టెస్ట్ క్రికెట్ రీఎంట్రీ వార్తలకు విరాట్ చెక్ పెట్టాడు. తనకు మళ్లీ టెస్ట్ క్రికెట్ ఆడే ఆలోచన లేదని తేల్చేశాడు. తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న విరాట్ హోస్ట్ అడిగిన ప్రశ్నకు జవాబిచ్చాడు. సదరు బ్రాండ్లోని ఓ షూ ధర కోహ్లీ చేసిన టెస్ట్ పరుగులతో సమానంగా ఉంది.
దీంతో హోస్ట్ మీరు ఇంకొన్ని పరుగులు చేసి ఆ షూ లాభాలను పెంచొచ్చు కదా అంటూ సరదాగా కోహ్లీని అడిగాడు. అయితే తాను తక్కువ ధరకు అమ్మడానికే ఇష్టపడతాననీ, మీరు అడుగుతున్న దానితో(టెస్ట్ క్రికెట్) తన పని అయిపోయిందనీ బదులిచ్చాడు. ఈ సందర్భంగా తన క్రికెట్ ప్రయాణాన్ని కింగ్ గుర్తు చేస్తున్నాడు. ఢిల్లీలో మొదలై ఈ స్థాయికి రావడం సంతోషంగా ఉందనీ, అభిమానుల ప్రేమ, మద్ధతుతోనే ఇది సాధ్య మైందంటూ వ్యాఖ్యానించాడు. కోహ్లీ తన టెస్ట్ కెరీర్లో 123 మ్యాచ్లు ఆడి 9230 రన్స్ చేశాడు. దీనిలో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలున్నాయి.






