11-09-2024 09:58:46 AM
హైదరాబాద్: వాల్మీకీ స్కామ్ పైసలే తెలంగాణ కాంగ్రెస్ మొన్న లోక్సభ ఎన్నికల్లో వాడిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. గిరిజనుల బాగుకోసం ఖర్చు చేయాల్సిన సొమ్మును ఎన్నికల ప్రచారం కోసం వాడుకున్న కాంగ్రెస్ నేతలను శిక్షించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. వాల్మీకి కుంభకోణంలో కాంగ్రెస్ నేత, కర్ణాటక మాజీ మంత్రి బీ నాగేంద్రనే కీలక సూత్రధారి అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన చార్జిషీట్లో నిర్ధారించిందన్నారు. కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్’కు చెందిన రూ.187 కోట్లు ఏకంగా కాంగ్రెస్ మంత్రి చేతులమీదుగా దారిమళ్లాయి. ఆ సొమ్ము తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మొన్న లోక్సభ ఎన్నికల ఫండింగ్ కోసం ఉపయోగించింది. వాల్మీకి స్కామ్లో ప్రధాన నిందితుడు సత్యనారాయణ వర్మ హైదరాబాద్కు చెందిన బిల్డర్. తెలంగాణకు చెందిన ఇద్దరు కీలక కాంగ్రెస్ నేతలకు సత్యనారాయణ వర్మ అత్యంత సన్నిహితుడన్నారు. ఇతనికి సంబంధించిన వ్యాపారంలోనూ ఇక్కడి కాంగ్రెస్ నేతలు భాగస్వాములుగా ఉన్నట్టు అనుమానాలు ఉన్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఇంకా చాలామంది కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు అనేది నిర్వివాదం అన్నారు. దర్యాప్తు సంస్థలు వాల్మీకీ స్కామ్ నిజాలు నిగ్గుతేల్చాలి. దోషులను కఠినంగా శిక్షించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.