03-06-2025 05:07:49 PM
శ్రీపాద మార్గ్ బైపాస్ రోడ్డు మార్కింగ్ త్వరగా పూర్తి చేయాలి..
ఇండస్ట్రియల్ పార్క్ కోసం 70 ఎకరాల ఎంజాయ్ మెంట్ సర్వే చేపట్టాలి..
అభివృద్ధి పనుల కోసం భూముల పరిశీలనలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష..
మంథని (విజయక్రాంతి): మంథని పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులకు అవసరమైన భూమిని ప్రణాళిక బద్ధంగా సేకరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష(District Collector Koya Sri Harsha) అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ మంథని ప్రాంతంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు అవసరమైన భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అంగులురు శివారు వద్ద మంథనిలో రోడ్లు భవనాల శాఖ ద్వారా చేపట్టే శ్రీపాద మార్గ్ బైపాస్ రోడ్డు నిర్మాణానికి అనువైన భూములు, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న 70 ఎకరాల భూమి, మంథని పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు కోసం అనుకూలంగా ఉన్న భూమిని పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ... మంథని పట్టణంలో శ్రీపాద మార్గ్, బైపాస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి అనువైన భూమి రోడ్లు భవనాల శాఖ అధికారులు వెంటనే మార్కింగ్ చేయాలని, ఆర్&బీ మార్కింగ్ ప్రకారం రెవెన్యూ అధికారులు ఎంజాయ్మెంట్ సర్వే చేపట్టడం జరుగుతుందని, బైపాస్ రోడ్ నిర్మాణానికి ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసేందుకు 10ఏ మినహాయింపు సాధించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. అంగులూరు శివారులో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న 70 ఎకరాలు సేకరణ కోసం ఎంజాయ్మెంట్ సర్వే ప్రారంభించాలని, పరిశ్రమల జోనల్ మేనేజర్ నుంచి మినహాయింపు తెచ్చుకోవాలని అధికారులకు సూచించారు.
మంథని పట్టణంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు తయారు చేసి సమర్పించాలని సర్వేయర్లకు తెలిపారు. అభివృద్ధి పనులకు సంబంధించి భూసేకరణ పనులను ప్రణాళిక బద్ధంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట మంథని రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్, మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.