17-10-2025 01:03:18 AM
గజం రూ. 3లక్షల10 వేలు
శేరిలింగంపల్లి , అక్టోబర్ 16 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం, రాయదుర్గం నాలెడ్జ్ సిటీ పరిధిలోని ప్రభుత్వ భూముల ఈ-వేలానికి టీజీఐఐసీ మళ్లీ సిద్ధమైంది. తాజా నోటిఫికేషన్ ప్రకారం, సర్వే నెంబర్ 83/1లో ఉన్న 4,718.22 చదరపు గజాల భూమిని ఈ-వేలంపద్ధతిలో విక్రయించనున్నారు. ఒక్కో చదరపు గజానికి రూ.3,10,000 రిజర్వ్ ధరను నిర్థారించారు.
అంటే, ఎకరానికి సుమారు రూ.124 కోట్లు ధరగా నిర్ణయించారు. ఈ-వేలం నవంబర్ 11 మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు టీజీఐఐసీ కార్యాలయంలో నిర్వహిస్తారు. అభ్యర్థులు అక్టోబర్ 17లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. వేలంలో పాల్గొనాలనుకునే వారు టీజీఐఐసీ అధికారిక వ్బుసైట్లో వివరాలు పొందుపర్చాలి. కాగా ఇప్పటికే రాయదుర్గం పరిధిలోని 18.67 ఎకరాలను టీజీఐఐసీ రెండు విడతలుగా వేలం వేసింది.
మొదటి విడతలో 7.67 ఎకరాలకు ప్రారంభ ధర ఎకరానికి రూ.101 కోట్లు కాగా, ఎంఎస్ఎన్ రియాల్టీ సంస్థ ఏకంగా రూ.177 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. మొత్తం విలువ రూ.1356 కోట్లకు చేరుకుంది.
తాజా రూ.124 కోట్ల రిజర్వ్ ధరను నిర్ణయించడం ద్వారా ఈ భూములకు ఎంత భారీ డిమాండ్ ఉందో స్పష్టమవుతోంది. గతానికి సరిగ్గా రూ.23 కోట్ల విస్తరణ కనిపించినట్లు అధికారులు తెలిపారు. కీలక స్థానంలో ఉండటంతో పేరున్న నిర్మాణ సంస్థలు ఈ-వేలంలో పాల్గొనవచ్చని టీజీఐఐసీ అధికారులు స్పష్టం చేశారు.