16-09-2025 08:38:02 AM
నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి
గద్వాల, (విజయక్రాంతి) : అర్హులందరికీ సకాలంలో రుణాలు మంజూరు చేయాలనీ, పెండింగ్ పెట్టరాదని నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి(Mallu Ravi) బ్యాంకర్లకు ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యలయంలోని కాన్ఫరెన్స్ హాలులో జూన్ 2025 మాసాంతపు జిల్లా స్థాయి బ్యాంకర్ల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, వనపర్తి జిల్లాలో ముఖ్యమంత్రి ఆధ్వర్యములో నిర్వహించిన నిరుద్యోగులకు రుణమేళ కార్యక్రమంలో జిల్లాకు రెండు వేల కోట్ల ఋణ లక్ష్యం కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు. ఇందులో బ్యాంకర్లు ఇప్పటి వరకు ఎంతమందికి రుణాలు మంజూరు చేయడం జరిగిందని యం.పి. బ్యాంకర్ లను అడుగగా, వారు స్పందిస్తూ ఇప్పటి వరకు 250 కోట్లను అందించడం జరిగిందన్నారు.
పార్లమెంట్ సభ్యులు వెంటనే స్పందిస్తూ లక్ష్యం మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణాలు అందించాలన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో ఎంత మందికి రుణాలు అందించారు, ఎన్ని గ్రౌండింగ్ చేశాను, ఎన్ని దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి పూర్తి వివరాలను అందజేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణాలు మంజూరు చేయాలన్నారు. జిల్లాలో యం.పి. నిధులతో గురుకుల పాఠశాలలు, పాఠశాలల్లో మరుగు దొడ్లు నిర్మించేందుకు 1.54 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని, పంచాయతీ రాజ్ అధికారులు ఇట్టి పనులను అక్టోబర్ మాసాంతం వరకు పూర్తి చేయాలని సూచించారు. అలాగే డిజిటల్ లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు యూనియన్ బ్యాంక్ వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ సమావేశంలో ఎల్ డి ఏం శ్రీనివాస్ రావు, ఆర్.బి.ఐ. ఏ.జి.యం. చేతన్ గవర్కర్, నాబార్డ్ డిడియం మనోహర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, బ్యాంకుల మేనేజర్లు, తదితరులు పాల్గొన్నారు.