సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడిన మహనీయుడు పూలే
సూర్యాపేట,(విజయక్రాంతి): సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావుపూలే అని మున్సిపల్ చైర్ పర్సన్ మోరిశెట్టి నివేదిక లక్షాధి, అదనపు కలెక్టర్ సీతారామారావులు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని యం.జి. రోడ్డు సర్కిల్ వద్ద వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పూలే జయంతి కార్యక్రమంలో వారు పాల్గొని, ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ సమానత్వ సమాజ నిర్మాణంలో పూలే కీలక పాత్ర పోషించారన్నారు.
ఆ కాలంలో కుల, మత భేదాలు ఉన్న పరిస్థితుల్లో సామాజిక సంస్కరణలకు పూలే శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. మొదటగా తన భార్య సావిత్రిబాయి పూలేకు విద్యాబోధన చేసి, ఆ తర్వాత ఆమె ద్వారా బాలికల విద్యకు మార్గం సుగమం చేసిన గొప్ప సంస్కర్త అని కొనియాడారు. ఆ రోజుల్లో కుల వివక్ష కారణంగా అనేక వర్గాల ప్రజలను దేవాలయాలు, పాఠశాలల్లోకి అనుమతించని పరిస్థితులను పూలే ధైర్యంగా ఎదిరించి సమాజంలో మార్పు తీసుకువచ్చారని తెలిపారు. అందుకే వారి జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు.




