01-12-2025 12:56:14 PM
మోతే,(విజయక్రాంతి): నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే సిపిఎం అభ్యర్థులకు అత్యధికంగా ఓట్లేసి గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు. సోమవారం మోతే మండల పరిధిలోని సిరికొండ గ్రామంలో జరిగిన సిపిఎం గ్రామ శాఖ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ... సిపిఎం పార్టీ అధికారం ఉన్న లేకున్నా ప్రజా సమస్యలే ఎజెండాగా నిరంతరం శ్రామిక వర్గ ప్రజల అభ్యున్నతి కోసం పనిచేస్తుందన్నారు.
వ్యవసాయ కార్మికులు, రైతులు, కార్మికులు, విద్యార్థి, యువజన, మహిళ, మేధావి వర్గం తరపున శక్తి వంచన లేకుండా పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో డబ్బు, కులం, మతం, అవినీతి, మద్యం వంటిప్రలోభాలకుగురికాకుండాఓటర్లుచైతన్య వంతంతో తమ ఓటుహక్కునువినియోగించుకోవాలన్నారు. మతోన్మాద విధానాలకు పాల్పడుతున్న బిజెపిని ఓడించాలన్నారు. సిపిఎం పార్టీ సభ్యులు బోడపట్ల హుస్సేన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం గ్రామ కార్యదర్శి కాంపాటి శ్రీను, మండల కమిటీ సభ్యులు జంపాల స్వరాజ్యం, పిడమర్తి అశోక్, పార్టీ సభ్యులు కాంపాటి జానయ్య, జంపాల ఉప్పలయ్య, తదితరులు పాల్గొన్నారు.