calender_icon.png 19 October, 2025 | 5:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

మళ్లీ మంజీరా పరవళ్లు..

19-10-2025 02:53:02 PM

* ఏడుపాయల్లో పెరిగిన గంగమ్మ ఉధృతి

* మరోసారి జలదిగ్బంధంలో వనదుర్గమ్మ

* రాజ గోపురంలో ప్రతిష్టించిన ఉత్సవ విగ్రహాన్ని దర్శించుకుంటున్న భక్తులు

పాపన్నపేట,(విజయక్రాంతి): వనదుర్గా ప్రాజెక్టు మరోసారి పొంగిపొర్లుతోంది. మంజీరా నదీ పాయలు పరవళ్ళు తొక్కుతున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత ఆలయం మళ్లీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆగస్టు 14 నుంచి 62 రోజులుగా అమ్మవారి దర్శనం నిలిపివేసిన సంగతి తెలిసింది. శుక్రవారం దర్శనం పునః ప్రారంభించగా రెండు రోజులు మాత్రమే భక్తులు వనదుర్గమ్మను దర్శించుకున్నారు.

ఆదివారం మళ్లీ మంజీరా ప్రవాహం స్వల్పంగా ఉండడంతో అమ్మవారి దర్శనం నిలిపివేశారు. భక్తులకు మూలవిరాట్ అమ్మవారి దర్శనం నిలిపివేసి రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్టించి భక్తులకు అమ్మ దర్శనం కల్పిస్తున్నారు. నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టగానే అమ్మవారి దర్శనం యధావిధిగా పున ప్రారంభిస్తామని ఆలయ అర్చకులు, అధికారులు పేర్కొన్నారు. నీటి ప్రవాహం వద్దకు భక్తులు ఎవరూ వెళ్లకుండా భారీకేడ్లు ఏర్పాటు చేశారు.

 ఆదివారం కిక్కిరిసిన భక్తజనం..

వరుస సెలవులు కావడంతో ఆదివారం ఏడుపాయల్లో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వనదుర్గమ్మను దర్శించుకునేందుకు తరలివచ్చారు. బోనాలు, ఓడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మరికొందరు భక్తులు తలనీలాలు సమర్పించి వన దుర్గమ్మ తల్లి.. చల్లంగా చూడమ్మా.. అంటూ వేడుకున్నారు. ఆలయ పరిసరాల్లోని పచ్చని చెట్లు, షెడ్లలో భోజనాలు చేసి సాయంత్రం ఇళ్లకు తిరుగుపయనమయ్యారు.